జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపోరా ఎయిర్ బేస్ సమీపంలో భారీ పేలుళ్లు వినిపించాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో అలర్ట్ సైరన్లు మోగించారు. పెద్ద ఎత్తున విద్యుత్‌ నిలిచిపోయింది. 

రాత్రి సమయంలో జమ్మూ, సమ్బా, పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు కనిపించాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. వీటిని భారత భద్రతా బలగాలు వెంటనే ట్రాక్ చేసి కూల్చివేస్తున్నాయి. శ్రీనగర్‌లో మసీదుల మైకుల ద్వారా ప్రజలకు లైట్లు ఆపేయమని సూచనలు ఇచ్చారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇది పాకిస్థాన్‌ మరోసారి డ్రోన్, మిసైల్‌లతో భారత ఆర్మీ స్థావరాలపై దాడి చేసేందుకు యత్నించిన రోజు తర్వాతి పరిస్థితి కావడం గమనార్హం. తాజా హెచ్చరికలు ఇంకా ఎలాంటి దాడులు జరగవచ్చన్న ఆందోళనను వెల్లడిస్తున్నాయి.

పాకిస్థాన్ డ్రోన్లు కేవలం సైనిక స్థావరాలకే కాకుండా పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ నగరంలో నివాస ప్రాంతాలపై కూడా దాడులు చేశాయి. అక్కడ ఆకాశంలో పెద్ద పెద్ద డ్రోన్లు కనిపించడంతో స్థానికులందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఖాయ్ ఫేమే కీ అనే ప్రాంతంలో డ్రోన్ పేలుడు వల్ల ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ నేపథ్యంలో భద్రతా వ్యవస్థలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజలు పుకార్లను విశ్వసించకుండా, అధికారిక సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాల‌ని సూచిస్తున్నారు. ఇక పాకిస్థాన్ చేస్తున్న డ్రోన్ దాడుల్లో సామాన్య ప్రజలకు గాయాలవుతున్నాయి.