పాకిస్తాన్ ఉగ్ర దాడుల పరంపరలో మరో ఘట్టంగా జమ్మూ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఎనిమిది క్షిపణులను ప్రయోగించింది. సత్వారి, సాంబా, ఆర్‌ఎస్‌పురా, అర్ణియా ప్రాంతాల్లో జరిగిన ఈ దాడులను భారత భద్రతా బలగాలు పూర్తిగా అడ్డుకున్నాయి. దీంతో పాకిస్తాన్ ప్రయత్నం పూర్తిగా విఫలమైంది.  

ఈ దాడుల అనంతరం భారత రక్షణ వర్గాలు వెల్లడించాయి. పాక్ సైన్యం హమాస్ ఉగ్రవాద సంస్థల తరహాలో తక్కువ ఖర్చుతో తయారైన రాకెట్లు, డ్రోన్లను వినియోగిస్తూ చిన్న స్థాయి దాడులకు పాల్పడుతోందని తెలిపాయి. దీంతో పాకిస్థాన్ ఆర్మీ ఎంత దారుణ ప‌రిస్థితిలో ఉందో అర్థ‌మ‌వుతోంది. ఉగ్ర‌వాద సంస్థ‌లు ఉప‌యోగించే ఆయుధాల‌ను పాకిస్థాన్ ఉప‌యోగిస్తోంది.

ఇదిలా ఉంటే పాకిస్తాన్ చేసిన భారీ కుట్రను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ 15 భారత నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడికి ప్రణాళిక రూపొందించగా, భారత ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సాయంతో వాటిని అటాక్ చేసింది. ఈ క్ర‌మంలోనే గురువారం ఉద‌యం భారత సైన్యం పాకిస్తాన్‌లోని లాహోర్ నగరంలో చైనా తయారీ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేసింది.

HQ-9 అనేది చైనా అభివృద్ధి చేసిన అధునాతన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. ఇది 120–250 కి.మీ. పరిధిలో ఏకకాలంలో అనేక లక్ష్యాలను గుర్తించి ఛేదించగలదని చైనా పెద్దగా ప్రచారం చేసింది. కానీ భారత డ్రోన్ దాడికి నిమిషాల్లోనే ధ్వంసమైపోవడం ఈ వ్యవస్థ పై విశ్వసనీయతను దిగజార్చింది. పాక్ ముఖ్యమైన నగరాలైన కరాచీ, లాహోర్, రావల్పిండి, గ్వాదర్ వంటి ప్రాంతాల్లో HQ-9 వ్యవస్థను మోహరిస్తూ వచ్చిన పాక్‌కు ఇది పెద్ద దెబ్బే.

HQ-9 ధ్వంసం కేవలం పాకిస్తాన్‌కు మిలిటరీ పరంగా దెబ్బకాదేగానీ, చైనా ఆయుధాల నాణ్యతపై అంతర్జాతీయంగా నమ్మకాన్ని కోల్పోయే విధంగా దెబ్బ వేసింది. చైనా తయారీ ఆయుధాలను కొనుగోలు చేస్తున్న అనేక దేశాలకు ఇది హెచ్చరికగా మారింది. సాంకేతికత, విశ్వసనీయతలో తక్కువ స్థాయిలో ఉన్న చైనా ఆయుధాలు అత్యవసర సమయాల్లో ఫెయిలయ్యే అవకాశాలు ఎక్కువని ఇది మరోసారి రుజువు చేసింది.