పెళ్లి బట్టలు ధరించి కలెక్టర్ ఆఫీసుకు 50 మంది వరుళ్లు.. వధువులు కావాలని డిమాండ్
మహారాష్ట్రలో సుమారు 50 మంది బ్యాచిలర్లు పెళ్లి కొడుకులుగా వస్త్రాధారణ చేసి కలెక్టర్ ఆఫీసుకు గుర్రాలపై స్వారీ చేస్తూ వెళ్లారు. అక్కడికి వెళ్లి తమకు పెళ్లి కుమార్తెలు కావాలని అడిగారు. లింగ అసమానతను హైలైట్ చేసి పీసీపీఎన్డీటీ యాక్ట్ను కఠినంగా అమలు చేయాలని వారు కలెక్టర్ను కోరారు.
ముంబయి: మహారాష్ట్రలో ఓ వింత కార్యక్రమం జరిగింది. 50 మంది బ్యాచిలర్లు పెళ్లి బట్టలు ధరించారు. వరుడి తలపాగా పెట్టుకున్నారు. పెళ్లి కొడుకు బట్టలు వేసుకున్నారు. గుర్రాలపై స్వారీ చేస్తూ కలెక్టర్ ఆఫీసుకు వెళ్లారు. తమకు పెళ్లి కూతురు కావాలని వారు డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో సోలాపూర్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం వెనుక ఉద్దేశం లింగ అసమానతను లేవనెత్తి చూపడమే అని నిర్వాహకులు చెప్పారు.
మహారాష్ట్రలో లింగ అసమానత పెరిగింది. పురుష, మహిళల నిష్పత్తి మధ్య తేడా పెరుగుతున్నది. ఈ అసమానతను హైలైట్ చేయడానికే బ్యాచిలర్లు మార్చ్ చేపట్టారు. అంతేకాదు, ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (పీసీపీఎన్డీటీ) యాక్ట్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పురుష, మహిళల నిష్పత్తులను మెరుగుపరచాలని కోరారు.
Also Read: మరో రెండు కులాలకు ఎస్టీ హోదా.. బిల్లును ఆమోదించిన రాజ్యసభ..
స్థానిక సంఘం ఒకటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి పెళ్లి కొడుకుల మోర్చా అని పేరు పెట్టారు. ఈ మార్చ్ కలెక్టర్ ఆఫీసు వరకు తీశారు. అక్కడ జిల్లా కలెక్టర్కు పీసీపీఎన్డీటీ యాక్ట్ను కఠినంగా అమలు చేయాలని ఓ మెమోరాండంను సమర్పించారు.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (2019-21) ప్రకారం మహారాష్ట్రలో సెక్స్ రేషియో 1000 మంది పురుషులకు 920 మంది మహిళలు ఉన్నారు.