Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ ఎయిర్పోర్టును తాత్కాలికంగా మూసివేసింది. సరిహద్దులకు సమీపంలో ఉన్న జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల పలు ఎయిర్పోర్టులను కూడా తాత్కాలికంగా మూసివేసింది.
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ విరుచుకుపడింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ దాడిలో అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ దూరంలోని బహవల్పూర్లో ఉన్న జైష్ ఏ మొహమ్మద్ ప్రధాన కార్యాలయం మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉన్న లష్కరే క్యాంప్పై మిస్సెల్ వర్షం కురిపించింది. ఈ ఆపరేషన్ సిందూర్లో 90 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. కానీ, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదిలాఉంటే.. ఆపరేషన్ సింధూర్ వేళ కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా అప్రమత్తమైన భారత ప్రభుత్వం నార్త్ ఇండియాలోని పలు ఎయిర్పోర్టును తాత్కాలికంగా మూసివేసింది. జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్కోట్ లోని 9 విమానాశ్రయాలు మే 10 వరకు మూసివేయబడ్డాయి. ఈ మేరకు ఆయా విమానసంస్థలు అధికారికంగా ప్రకటించాయి.
ఎయిర్ ఇండియా తన ప్రకటనలో ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో శ్రీనగర్,జమ్మూ,అమృత్సర్,లేహ్,చండీగఢ్,ధర్మశాల నగరాల వైపు సర్వీసులు నిలిచిపోయినట్లు పేర్కొంది. ఈ ఆంక్షాలు మే 10 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. ఈ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లను రీ షెడ్యూల్ చేస్తున్నట్టు పేర్కొంది. మరింత సమాచారం కోసం 011-69329333 / 011-69329999 నంబర్లకు సంప్రదించండి లేదా మా వెబ్సైట్ airindia.comని సందర్శించండని ఎయిర్లైన్స్ తెలిపింది.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో శ్రీనగర్తో సహా 18 విమానాశ్రయాలు బుధవారం మూసివేయబడ్డాయి. 200 కంటే ఎక్కువ విమానాలు రద్దు చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో ఇండిగో కూడా దాదాపు 160 విమానాలను రద్దు చేసింది. జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్కోట్ విమానాశ్రయాలకు సేవలు రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.