ప్రాచీన నగరంలో నూతన పోకడలు..! న్యూ ఇయర్ రోజున ఓయో బుకింగ్స్లో గోవాను వెనక్కి నెట్టిన కాశీ
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఓయో బుకింగ్స్ గోవా కంటే కూడా వారణాసిలో ఎక్కువ జరిగాయని ఓయో ఫౌండర్, గ్రూప్ సీఈవో రితేష్ అగర్వాల్ వెల్లడించారు. 2022లో అత్యధిక బుకింగ్స్ డిసెంబర్ 31వ రోజునే జరిగాయని తెలిపారు.
న్యూఢిల్లీ: భారత దేశంలో అతి ప్రాచీన నగరాల్లో కాశీ నగరం ఒకటి. దీనికి ఆధ్యాత్మికంగా మంచి ప్రాధాన్యత ఉన్నది. ఈ పురాతన నగరమైన వారణాసి ఓయో బుకింగ్స్లో గోవాను బీట్ చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా ఓయో బుకింగ్స్ రికార్డులు తిరగరాశాయి. ఇందులో అనూహ్యంగా గోవా కంటే కూడా వారణాసిలో బుకింగ్స్ ఎక్కువ జరిగినట్టు కంపెనీ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో రితేష్ అగర్వాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రాచీన నగరం.. ఆధునిక పోకడల్లోనూ దూసుకుపోతున్నదని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
2022లో ఓయో బిజీగా ఉన్న రోజు న్యూ ఇయర్ జరుపుకున్న రోజే అని ఓయో తెలిపింది. 2022 లో ఓయో అత్యంత బిజీగా ఉన్నది డిసెంబర్ 31వ తేదీనే అని ఓయో సీఈవో రితేష్ అగర్వాల్ తెలిపారు. ఈ విషయాలను ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు. ఇలాంటి ఓ ట్వీట్లోనే ఆయన ఆసక్తికరమైన విషయం.. గోవా కంటే కూడా వారణాసి లో ఎక్కువ ఓయో బుకింగ్స్ వచ్చాయని వివరించారు.
Also Read: ఓయో సంచలన నిర్ణయం.. వందల ఉద్యోగుల తొలగింపు.. కారణం ఏంటంటే..?
ప్రపంచవ్యాప్తంగా 4.50 లక్షలకు మించి బుకింగ్స్ ఆ రోజే జరిగాయని వివరించారు. గతేడాదితో పోలిస్తే ఇది 35 శాతం ఎక్కువ అని తెలిపారు. మరో ట్వీట్లో ఆయన వివరాలు వెల్లడిస్తూ గోవాలో బుకింగ్స్ గంట గంటకు పెరుగుతూ వచ్చాయని తెలిపారు. కానీ, గోవాను ఓవర్టేక్ చేసిన సిటీ ఏదో గెస్ చేయగలరా? వారణాసి అని అతడే సమాధానం ఇచ్చారు.
ఓయో వార్షిక ట్రావెల్ ట్రెండ్స్ ఇండెక్స్ ట్రావెలోపిడియా 2022 ప్రకారం, చిన్న పట్టణాల్లో ఓయో బుకింగ్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. 2022లో ఉత్తరప్రదేశ్ మోస్ట్ విజిటెడ్ రాష్ట్రంగా ఉన్నదని ఓయో డేటా వెల్లడించింది. చిన్న పట్టణాలు, చిన్న నగరాలు ఉదాహరణకు హత్రాస్, శ్రీనగర్(ఉత్తరాఖండ్), సాసారామ్, కరైకుడి, తెనాలి వంటి పట్టణాల్లో 2021తో పోల్చితే 2022లో ఎక్కువ బుకింగ్స్ రికార్డ్ అయ్యాయని తెలిసింది.