COVID-19 cases in India: ఆ తర్వాత నవంబర్లోనే తక్కువ కరోనా కేసులు.. ఎన్ని పాజిటివ్ కేసులు వచ్చాయంటే..
దేశంలో సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత ఏడాది మే తర్వాత.. ఈ ఏడాది నవంబర్లో అతి తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే జనాలు కూడా కరోనా పరిస్థితుల నుంచి తేలుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో కోవిడ్ కేసుల గణంకాలు చూస్తే.. కేసుల సంఖ్య 18 నెలల కనిష్టానికి పడిపోయింది. గత ఏడాది మే తర్వాత.. ఈ ఏడాది నవంబర్లో అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. నవంబర్ నెలలలో మొత్తంగా 3.11 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఈ ఏడాది మే 6వ తేదీన దేశంలో 24 గంటల వ్యవధిలో 4,14,188 కోవిడ్ కేసులు నమోదైనప్పుడు.. రోజువారీ కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఇక, గత 159 రోజులుగా దేశంలో రోజువారి కరోనా కేసుల సంఖ్య 50 వేలు దాటలేదు. అలాగే గత 54 రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 వేల మార్క్ను దాటలేదు.
ఇక, భారత్లో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు 2020 జనవరి 30న కేరళలో నమోదైంది. భారతదేశం యొక్క కోవిడ్-19 కేసుల సంఖ్య.. ఆగస్టు 7, 2020న 20 లక్షలు, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు, సెప్టెంబర్ 16న 50, సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు, గతేడాది డిసెంబర్ 19న కోటి మార్కును దాటింది. ఈ ఏడాది మే 4న దేశం రెండు కోట్ల కరోనా కేసుల మైలురాయిని దాటగా.. జూన్ 23న మూడు కోట్ల మార్కును దాటింది.
ఇక, మంగళవారం 11,08,467 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,954 మందికి వైరస్ పాజిటివ్గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (corona cases in india) ప్రకటించింది. కొత్త కేసులు 10వేలకు దిగువనే ఉన్నప్పటికీ.. ముందురోజు కంటే పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 10,207 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు సంఖ్య 99,023(0.29 శాతం)కి చేరింది.