ఈడీ ముందుకు బాలీవుడ్ నటి నోరా ఫతేహి.. రూ. 200 కోట్ల చీటింగ్ కేసులో ప్రశ్నలు
రూ. 200 కోట్ల చీటింగ్ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ఈడీ ప్రశ్నించింది. రేపు మరో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ప్రశ్నించనుంది. సుకేశ్ చంద్రశేఖర్ దంపతులు రూ. 200 కోట్లను మోసపూరితంగా ఫోర్టిస్ హెల్త్కేర్ ప్రమోటర్ కుటుంబం నుంచి కాజేసింది. ఈ కేసును ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ప్రస్తుతం సుకేశ్ చంద్రశేఖర్ ఢిల్లీలోని ఓ జైలులో ఉన్నాడు.
ముంబయి: బాలీవుడ్లో ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారంపై కలకలం రేగుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు రూ. 200 కోట్ల చీటింగ్ కేసు కూడా సంచలనంగా మారుతున్నది. తాజాగా ఈ కేసును విచారిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ ED ముందు బాలీవుడ్ యాక్టర్, ప్రముఖ డ్యాన్సర్ Nora Fatehi హాజరయ్యారు. రేపు మరో Bollywood Actor జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఈడీ ప్రశ్నించనుంది.
17ఏళ్ల నుంచే నేర ప్రపంచంలో మునిగి మోసగాడిగా పేరున్న సుకేశ్ చంద్రశేఖర్, ఆయన భార్య, నటి లీనా పాల్లపై ఢిల్లీ పోలీసులు అఫెన్స్ వింగ్ కేసు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, చీటింగ్, బలవంతపు వసూళ్లు వంటి ఆరోపణలపై కేసు రిజిస్టర్ చేసింది. ఈ కేసులోని విషయాలపై స్పష్టత కోసం ఈడీ అటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇటు నోరా ఫతేహిలను ప్రశ్నిస్తున్నది. ఇప్పటి వరకైతే వీరు ఈ కేసులో నిందితులు కాదని సంబంధితవర్గాలు తెలిపాయి. అయితే, బలవంతపు వసూళ్ల ద్వారా వచ్చిన సొమ్ములో వీరేమైనా బెనిఫిట్ పొందారా? అనే కోణంలో వీరిపై ప్రశ్నలు కురిపిస్తున్నట్టు సమాచారం.
నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్లనూ ఆ సుకేశ్ చంద్రశేఖర్ దంపతులు మోసం చేశారనే వార్తలు ఉన్నాయి.
Also Read: రూ.200 కోట్ల స్కామ్ లో ఈడీ ముందుకు జాక్వెలిన్.. అతడితో ఫోన్ కాల్స్
సుకేశ్ చంద్రశేఖర్ దంపతులు ఫోర్టిస్ హెల్త్కేర్ ప్రమోటర్ శివిందర్ సింగ్ కుటుంబాన్ని మోసం చేసి రూ. 200 కోట్లు కాజేసినట్టు కేసు ఫైల్ అయింది. శివిందర్ సింగ్ జైలులో ఉన్నప్పుడు ఆయనకు బెయిల్ ఇప్పిస్తానని, అందుకు బదులుగా రూ. 200 కోట్లు అందివ్వాలని న్యాయశాఖ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారిగా నమ్మించాడని శివిందర్ సింగ్ సతీమణి అదితీ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది జూన్ మొదలు మొత్తం 30 విడతల్లో రూ. 200 కోట్లు సుకేశ్కు కట్టినట్టు అదితీసింగ్ పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ తమ వైపే ఉన్నారని సుకేశ్ నమ్మబలికినట్టు వివరించారు.
నిజానికి ఈ ఘటన జరిగినప్పుడూ సుకేశ్ చంద్రశేఖర్ ఢిల్లీలోని రోహిణీ జైలులో ఉన్నారు. ఆయన జైలులో ఉన్నప్పటికీ తన ఎక్స్టార్షన్ రాకెట్ను నడిపించారని ఆరోపణలున్నాయి.
రూ. 200 చీటింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండ్ను ఆగస్టులోనూ ఈడీ ప్రశ్నించింది. ఆమె వాంగ్మూలాన్ని తీసుకుంది. ఆగస్టులో ఈడీ విడుదల చేసిన ఓ స్టేట్మెంట్ ప్రకారం, ‘సుకేశ్ చంద్రశేఖర్ మోసగాడు. ఆయనకు 17ఏళ్ల వయసు నుంచి నేర ప్రపంచంలో ఉన్నాడు. ఆయనపై అనేక ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్నాయి. ఇప్పుడు రోహినీ జైలులో ఉన్నారు. జైలులో ఉన్నప్పటికీ మోసం చేసే పనులు మాత్రం ఆపలేదు. ప్రభుత్వ అధికారులుగా నమ్మించి ఎన్నోసార్లు బురిడీ కొట్టించాడు. తాజాగా ఓ సీనియర్ ప్రభుత్వ అధికారిగా నమ్మించి సుమారు రూ. 200 కోట్లను కొల్లగొట్టాడు.’ అని పేర్కొంది. అంతేకాదు, ‘సుకేశ్ చంద్రశేఖర్ దంపతులకు చెందిన నివాసాలపై తనిఖీలు చేయగా వారిద్దరూ విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడ్డవారని తెలిసింది. చెన్నైలో సీఫేస్ బంగ్లా అది రీసార్ట్కు ఏమాత్రం
తగగ్కుండా ఉన్నది. బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్, మెర్సిడెస్లున్నాయి. అనేక కార్లున్నాయి. సేవకులున్నారు’ అని తెలిపింది.
Also Read: రెండో ప్రపంచయుద్ధంలో ఇండియాలో పాతిపెట్టిన బాంబులు.. ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి
ఈడీ తనిఖీల్లో చెన్నైలోని బంగ్లా సహా రూ. 82.5 లక్షల నగదు, కనీసం 12 లగ్జరీ కార్లు సీజ్ చేసింది. ఇంటర్నేషనల్ బ్రాండ్ షూస్, బ్యాగ్స్, క్లాథ్స్లు కలిపి సుమారు రూ. 20 కోట్ల వస్తువులను స్వాధీనం చేసుకుంది.