టీకా వేసుకోకుంటే బస్సులు, పార్కులు, ఇతర ప్రభుత్వ ప్రాంతాల్లోకి నో ఎంట్రీ.. మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం
టీకా పంపిణీ వేగాన్ని పెంచడానికి గుజరాత్లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు డోసుల టీకా తీసుకోనివారికి బస్సులు, పార్క్లు, లైబ్రరీలు, జిమ్నాషియం, ఇతర ప్రభుత్వ ప్రాంతాల్లోకి అనుమతినివ్వబోమని స్పష్టం చేసింది. 18ఏళ్లు పైబడినవారు తప్పకుండా టీకా తీసుకున్నట్టు సర్టిఫికేట్లు చూపెట్టాలని తెలిపింది.
అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి కేంద్రం సహా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయినప్పటికీ అక్కడక్కడ టీకాపై సంశయాలున్నాయి. ఈ నేపథ్యంలోనే వ్యాక్సినేషన్ వేగం పెంచడానికి అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వ బస్సులు, పార్క్లు, రివర్ఫ్రంట్లు, లైబ్రరీలు, ఇతర ప్రభుత్వ ప్రాంతాలు, కార్యాలయాల్లోకి వ్యాక్సిన్ వేసుకున్నవారికే అనుమతినిస్తామని, రెండు డోసులు తీసుకోని వారికి నో ఎంట్రీ అని స్పష్టం చేసింది.
ఏఎంసీ పరిధిలోని పార్క్స్, గార్డెన్ డైరెరక్టర్ జిగ్నేశ్ పటేల్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 18 ఏళ్లు పైబడినవారంతా తాము టీకా వేసుకున్నట్టు ధ్రువపరిచే సర్టిఫికేట్లు, లేదా ఫోన్లలో ఈ సర్టిఫికేట్నైనా చూపించాల్సి ఉంటుందని వివరించారు. అది చూపించి టీకా రెండో డోసులు వేసుకున్నట్టు కన్ఫమ్ అయితేనే తమ ఫెసిలిటీల్లోకి అనుమతిస్తామని తెలిపారు.
‘అహ్మదాబాద్ మున్సిపల్ ట్రాన్స్పోర్ట్ సర్వీసులు, బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిసట్మ్, కంకారియా లేక్ ఫ్రంట్, రివర్ ఫ్రంట్, లైబ్రరీలు, జిమ్నాషియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్విమ్మింగ్ పూల్, సిటీ సివిక్ సెంటర్లలోకి టీకా తీసుకోనివారికి అనుమతి లేదు’ అని స్పష్టం చేశారు. టీకా పంపిణీ వేగాన్ని పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ‘కరోనా మహమ్మారిని అంతమొందించడానికి టీకా ఒకటే ఆయుధం. టీకా తీసుకోనివారిని పార్క్లు, గార్డెన్లలోకి అనుమతిలేదు. రెండో డోసు తీసుకోకున్నా ఇదే నిబంధన వర్తిస్తుంది’ అని వివరించారు.
ఏఎంసీ నిర్ణయంపై స్థానికుల్లో సానుకూల అభిప్రాయలే వ్యక్తమయ్యాయి. ‘ఇది సరైన నిర్ణక్ష్ం. ఇలాంటి కఠిన నిబంధనలు తీసుకుంటేనే ప్రజలను టీకా వేసుకోవడానికి ప్రోత్సహించినవారమవుతాం. ప్రతి ఒక్కరూ టీకా తీసుకుంటే అది అందరికీ మంచిది. ఏఎంసీ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం’ అని పార్క్లోని ఓ వ్యక్తి అన్నారు. మరో పర్యాటకుడు దీపక్ గెహ్లాట్ మాట్లాడుతూ ‘ఇది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే ఇప్పటికీ కొందరు కొవిడ్ నిబంధనలు పాటించడం లేదు. కనీసం మాస్క్ కూడా ధరించడం లేదు. ప్రభుత్వం, కార్పొరేషన్లు ఇలాగే కఠిన నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు తప్పకుండా సహకరిస్తారు’ అని అన్నారు.