ఎన్సీపీలో చీలికే లేదు: ఎన్నికల కమిషన్కు శరద్ పవార్ శిబిరం సమాధానం
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలికే లేదని శరద్ పవార్ శిబిరం ఎన్నికల కమిషన్కు సమాధానం ఇచ్చింది. పార్టీలో తిరుగుబాటు చేసిన నేతలను పార్టీ నుంచి, పలు హోదాల నుంచి తొలగించినట్టు స్పష్టం చేసింది. చట్టసభ్యులుగానూ వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు విజ్ఞప్తి చేసినట్టు వివరించింది.

న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇంకా అంతుపట్టని ఎపిసోడ్గా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలిక గురించి తాజాగా మరో అప్డేట్ వచ్చింది. ఎన్నికల కమిషన్కు ఇచ్చిన సమాధానంలో శరద్ పవార్ శిబిరం.. అసలు పార్టీలో చీలికే లేదని చెప్పింది.
పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన 40 మంది చట్టసభ్యులను డిస్క్వాలిఫై చేశామని ఎన్సీపీ లీడర్ శరద్ పవార్ పేర్కొన్నారు. ఆ చట్టసభ్యుల పై అనర్హత వేటు వేయాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ముందు ఓ పిటిషన్ దాఖలు చేసినట్టు వివరించారు. ఈ తిరుగుబాటు నేతలందరినీ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి ఇతర హోదాల నుంచి తొలగించినట్టు తెలిపారు.
పార్టీలో చీలిక వచ్చిందని, పార్టీ కంట్రోల్ కూడా మారినట్టు ఎన్నికల కమిషన్ ముందుకు రావడంతో ఉభయ శిబిరాల నుంచి సమాధానాలను ఆదేశించింది. అజిత్ పవార్ శిబిరం ఇప్పటికే సమాధానం ఇచ్చింది. శరద్ పవార్ శిబిరానికి ఈ నెల 13వ తేదీ వరకు గడువు పొడిగించింది.
Also Read: నేను చెప్పిందే నిజమైంది.. ఆ పార్టీ బీజేపీకి బీ టీమ్ అని తేలింది: సీఎం వ్యాఖ్యలు
పార్టీ తన అధ్యక్షుడిని మార్చుకుందని, కొత్త అధ్యక్షుడిగా అజిత్ పవార్ను ఎన్నుకుందని అజిత్ పవార్ వర్గం జూన్ 30వ తేదీన ఈసీకి తెలిపింది. నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్ సారథ్యంలో ఉన్నదని, కాబట్టి, పార్టీకి సంబంధించిన అన్ని హక్కులు, ఎన్నికల గుర్తు, పార్టీ పేరు తమకే దక్కాలని డిమాండ్ చేస్తూ ఈసీ ముందు పిటిషన్ వేశారు.