ఒకే టాయిలెట్ రూమ్లో రెండు సీట్లు.. ఫొటో వైరల్.. యూపీ అధికారులు సీరియస్
ఉత్తరప్రదేశ్లో ఒకే టాయిలెట్ గదిలో రెండు టాయిలెట్ సీట్లు నిర్మించారు. కొన్ని టాయిలెట్లకు డోర్లు పెట్టలేదు. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై సదరు జిల్లా అధికారులు సీరియస్ అయ్యారు. బాధ్యులపై యాక్షన్ తీసుకుంటామని చెప్పారు.
లక్నో: ఉత్తరప్రదేశ్లో పబ్లిక్ టాయిలెట్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ టాయిలెట్లు విచిత్రమైన మోడల్స్లో దర్శనం అయ్యాయి. ఒకే రూమ్లో రెండు టాయిలెట్ సీట్లు ఉన్నాయి. అంటే.. మధ్యలో ఎలాంటి గోడ లేదా తెర లేకుండానే పక్క పక్కనే టాయిలెట్ బేసిన్లు అమర్చారు. మరికొన్ని టాయిలెట్లకు అసలు డోర్లు లేవు. ఉత్తరప్రదేశ్ బస్తి జిల్లా గౌర దుందా గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన కమ్యూనిటీ టాయిలెట్ కాంప్లెక్స్ ఫొటోలే ఇవి. వీటిని అక్కడి ప్రభుత్వ సంప్రదాయం ప్రకారం ఇజ్జత్ ఘర్ అని పిలుస్తున్నారు. రూ. 10 లక్షలు వెచ్చించి వీటిని నిర్మించారు.
నిర్మాణాలు ఇలా ఉండటంతో ఆ పబ్లిక్ టాయిలెట్లను ఎవరూ వినియోగించడం లేదు.
దీనిపై జిల్లా అధికారులు స్పందించారు. ఈ విషయాన్ని తాము దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. కొన్ని టాయిలెట్ గదుల్లో అడ్డు గోడలు లేకుండా పక్క పక్కనే రెండు టాయిలెట్ సీట్లు ఉన్నాయని, మరికొన్ని టాయిలెట్లకు డోర్లు లేవని, ఇలా ఎందుకు నిర్మించాల్సి వచ్చిందో వివరించాలని సంబంధిత అధికారులను తాము ప్రశ్నించినట్టు చెప్పారు. ఈ మేరకు జిల్లా పంచాయత్ రాజ్ అధికారి నమ్రత శరణ్ ఎన్డీటీవీకి వివరించారు.
ఈ నిర్లక్ష్యానికి కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా మెజిస్ట్రేట్ ప్రియాంక నిరంజన్ తెలిపారు.
సోషల్ మీడియాలో బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేస్తూ డబుల్ ఇంజిన్ సర్కారు ఇలాగే ఉంటుందన్నట్టు ట్వీట్లు చేస్తున్నారు.