బీజేపీ కూటమిలోకి జేడీయూ.. 28న సీఎంగా నితీశ్ ప్రమాణం.. ఇద్దరు డిప్యూటీలుగా బీజేపీ ఎమ్మెల్యేలు?
బీజేపీ కూటమిలోకి జేడీయూ చేరడం ఖాయంగా కనిపిస్తున్నది. అధికారిక ప్రకటన రాలేదు గానీ.. సీఎం 7వ సారి నితీశ్ ప్రమాణం చేయడం, అందుకు తేదీ, డిప్యూటీలు కూడా ఖరారైనట్టు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఎత్తుగడలో భాగంగా బీజేపీకి సిద్ధమైందని, నితీశ్ కుమార్ మాత్రం ఇండియా కూటమిపై అసంతృప్తితో నిర్ణయాలు తీసుకున్నట్టు పేర్కొంటున్నాయి.
![nitish kumar to take oath on 28th as bjp jdu cm, 2 bjp deputy cm to swear in says sources kms nitish kumar to take oath on 28th as bjp jdu cm, 2 bjp deputy cm to swear in says sources kms](https://static-ai.asianetnews.com/images/0cf9b2e2-c85f-5995-b8ad-d29a47ec6fcf/image_363x203xt.jpg)
Nitish Kumar: బిహార్లో రాజకీయం ఒక్కసారి రసవత్తరంగా మారింది. ఇండియా కూటమి కోసం మొదటి నుంచి ప్రయత్నాలు చేసిన నితీశ్ కుమార్ ఇప్పుడు ఆ కూటమిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కూటమి బాధ్యతల్లో కీలక పదవి దక్కకపోవడం, సీట్ల పంపకాల్లోనూ కాంగ్రెస్ జాప్యంతో ఆయన తిరిగి బీజేపీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నట్టు కొన్ని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 28వ తేదీన నితీశ్ కుమార్ అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నాడు. ఓ కార్యక్రమంలో ప్రసంగించాల్సిన పనిని కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. దీంతో ఆదివారం ఆయన బీజేపీ-జేడీయూ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయవచ్చని చెబుతున్నారు. ఆయనకు బీజేపీకి చెందిన ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారనీ చర్చ జరుగుతున్నది.
బీజేపీ కూటమిలోకి జేడీయూ వెళ్లిన తర్వాత సీఎంగా నితీశ్ ప్రమాణం చేయడం, ప్రతి నలుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రిని (బీజేపీ ఎమ్మెల్యేలను అకామడేట్ చేయడానికి) చేర్చుకుని మంత్రివర్గ ప్రక్షాళన కార్యక్రమాలు ఉండనున్నాయి. ముందుగా కొత్త స్పీకర్ను కూడా ఎన్నుకుంటారని తెలిసింది.
నితీశ్ కుమార్ పార్టీ కూటమి మారడం మూలంగా అసెంబ్లీని రద్దు చేయాలనే ఆలోచనలేమీ లేవని తెలుస్తున్నది. ఎన్నికలూ జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే బిహార్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. కాబట్టి, ఏ పార్టీ కూడా ఎన్నికల కోసం హడావుడిలో లేవు. ఇప్పుడు పార్టీ ఫోకస్ అంతా కూడా లోక్ సభ ఎన్నికలపై ఉన్నాయి.
ఈ సారి లోక్ సభ సీట్ల సంఖ్యను తగ్గించినా నితీశ్ కుమార్ బీజేపీ కూటమిలో చేరడానికి అంగీకరించారని కొన్ని వర్గాలు తెలిపాయి. 2019లో జేడీయూ 17 లోక్ సభ సీట్లలో పోటీ చేయగా అందులో 16 స్థానాలను గెలుచుకుంది. కానీ, ఈ సారి జేడీయూకు 12 నుంచి 15 సీట్లను మాత్రమే కేటాయిస్తామని, ఇతర పార్టీలకూ సీట్లు కేటాయించాల్సి ఉన్నదని బీజేపీ కండీషన్ పెట్టినా.. అందుకు జేడీయూ అంగీకరించినట్టు సమాచారం.
Also Read : గవర్నర్ ఎమ్మెల్సీ నియామకాలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్.. కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రికి నిదర్శనం
వీటిపై అధికారిక ప్రకటన ఒక్కటి కూడా ఇది వరకు రాలేదు. కానీ, బీజేపీ నుంచి వస్తున్న స్పందనతోనే అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు సీఎంగా నితీశ్ కుమార్ ఉండగా.. ఆయనకు డిప్యూటీగా బీజేపీ ఎమ్మెల్యే సుశీల్ కుమార్ మోడీ ఉన్నారు. ఆయన ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా చేస్తున్నారు. బీజేపీ నుంచి జేడీయూ తెగతెంపులు చేసుకున్న తర్వాత నితీశ్ కుమార్ను సుశీల్ కుమార్ మోడీ తరుచూ విమర్శించేవారు. కానీ, ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చని, ఎవరికీ ద్వారాలు శాశ్వతంగా మూసివేసి ఉండవని కామెంట్ చేశారు. అవసరాన్ని బట్టి ఎవరికైనా ద్వారాలు తెరుచుకుంటాయని వివరించారు. దీంతో ఆయన నితీశ్ కుమార్ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారని చర్చిస్తున్నారు.
Also Read: Republic Day: గణతంత్ర రిపవేడుకల్లో యూపీ నుంచి బాలరాముడి శకటం
ఈ ప్రచారానికి ముందు జేడీయూలోనూ ప్రక్షాళన జరిగినట్టు తెలిసింది. జేడీయూ బాస్గా లలన్ సింగ్ను తొలగించి నితీశ్ కుమార్ బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్జేడీతో దూరం కావద్దని లలన్ సింగ్ అభిప్రాయపడ్డారని, సంజయ్ ఝా, అశోక్ చౌదరిలు మాత్రం బీజేపీతో పొత్తుకు ఒత్తిడి తెచ్చినట్టు వాదనలు వస్తున్నాయి.