నిర్భయ కేసు: తీహార్ జైల్లో దోషులకు ఉరి పడింది
ఎట్టకేలకు అన్ని చిక్కులు తొలగిపోవడంతో తీహార్ జైలులో నిర్భయ కేసు దోషలు నలుగురికి ఉరి శిక్ష అమలైంది. ఉదయం 5..30 గంటలకు వారిని ఉరి తీశారు. దాదాపు ఏడున్నరేళ్ల తర్వాత దోషులకు శిక్ష పడింది.
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులను నలుగురిని తీహార్ జైలులో శుక్రవారం ఉదయం సరిగ్గా 5.30 గంటలకు ఉరి తీశారు. పవన్ జలాద్ వారికి ఉరేశాడు. వారిని ఉరి తీయడానికి మూడు సార్లు కోర్టు డెత్ వారంట్ జారీ చేసింది. చివరకు మూడో డెత్ వారంట్ అమలైంది. దాదాపు ఏడున్నరేళ్ల తర్వాత నిర్భయ కేసు దోషులకు శిక్ష పడింది. అంతకు ముందు ఉదయం నాలుగు గంటలకు వారికి అల్పాహారం ఇచ్చారు.
వారిని ఉరి తీయడనికి తెల్లవారు జామున 1.30 గంటలకు ఏర్పాట్లు చేశారు. తలారి పవన్ జల్లాద్ మంగళవారంనాడే తీహార్ జైలుకు చేరుకున్నాడు. నలుగురు దోషులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి ఆరోగ్యం బాగుందని వైద్యులు ధ్రువీకరించారు.
ముకేష్ సింగ్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ (31)లకు ఉరి శిక్ష పడింది. ఈ నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఆరుగురు నిందితులు ఉండగా, ఒకతను మైనర్ కావడంతో శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.
Also Read: ఖేల్ ఖతం: నిర్భయ దోషులకు రేపే ఉరి, లాయర్ ఏపీ సింగ్ చివరి రోజు డ్రామాలు ఇవే..
2012 డిసెంబర్ 16వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో ఆరుగురు వ్యక్తులు వైద్యవిద్యార్థినిపై అత్యాచారం చేసి, ఆమెను చిత్రహింసలు పెట్టారు. సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13 రోజుల తర్వాత 2012 డిసెంబర్ 29వ తేదీన ఆమె మరణించింది.
డిసెంబర్ 16వ తేదీన ఆమె తన మిత్రుడితో కలిసి సాకేత్ వద్ద సినిమా చూసి రాత్రి 9.30 గంటలకు బస్సు ఎక్కారు. ఆ బస్సులో డ్రైవర్ కాకుండా మరో ఐదుగురు ఉన్నారు. ఆమె స్నేహితుడిని ఇనుపకడ్డీతో కొట్టి వైద్య విద్యార్థినిపై బస్సు డ్రైవర్ తో పాటు ఆ ఐదుగురు అత్యాచారం చేశారు. బస్సులోనే గంటకుపైగా ఆమె అత్యాచారం జరిపి ఆమెను, ఆమె మిత్రుడిని బస్సు నుంచి కిందకు తోసేశారు.
అపస్మారక స్థితిలో నగ్నంగా పడి ఉన్న వారిద్దరిని అటుగా వెళ్తున్నవారు చూసి టోల్ ప్లాజ్ గస్తీ వాహన సిబ్బందికి తెలిపారు. దాంతో వారు ఇద్దరని సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో చేర్చారు. వైద్య విద్యార్థినిని వెంటలేటర్ మీద ఉంచారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను డిసెంబర్ 26వ తేదీన సింగపూర్ లోని ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించారు. 29వ తేదీన ఆమె తుదిశ్వాస విడిచింది.
ఈ కేసులో పోలీసులు డిసెంబర్ 21వ తేదీన బస్సు డ్రైవర్ సహా ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ సంఘటనపై దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద యెత్తున ఆందోళనలు జరిగాయి.