తీహర్ జైలులో  ఉన్న  మంత్రి సత్యేంద్రజైన్ కు  సంబంధించిన  వీడియో  ఒకటి  వెలుగు  చూసింది.  జైలులో  మంత్రి జైన్ కు  అందించిన  భోజనానికి  సంబంధించిన దృశ్యాలు ఈ  వీడియోలో  ఉన్నాయి.  తన కు  భోజనం సరిగా  అందించడం  లేదని  కోర్టులో  పిటిషన్  దాఖలు  చేసిన  మరునాడే  ఈ  వీడియోలు  బయటకు  రావడం గమనార్హం.

న్యూఢిల్లీ:ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్ కు చెందిన వీడియోలు బుధవారంనాడు వెలుగు చూశాయి. సలాడ్, పండ్లు, ఇతర ఆహర పదార్ధాలు తింటున్నట్టుగా ఆ వీడియోల్లో దృశ్యాలున్నాయి..సెప్టెంబర్ 13, అక్టోబర్ 1వ తేదీల్లో ఈ వీడియోలు రికార్డైనట్టుగా ఉన్నాయి. తీహర్ జైలులో సరైన భోజనం అందించడం లేదని ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్ మంగళవారంనాడు కోర్టులో ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు చేసిన మరునాడే ఈ వీడియోలు బయటకు వచ్చాయి. తీహార్ జైలు అధికారులు తనకు సరైన భోజనం అందించన కారణంగా తాను 28 కిలోల బరువు తగ్గినట్టుగా సత్యేంద్ర జైన్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను జైలు అధికారులు తోసిపుచ్చారు. జైలులో ఉన్న సమయంలో సత్యేంద్రజైన్ 8 కిలోల బరువు పెరిగినట్టుగా చెప్పారు. తన మత విశ్వాసాల ఆధారంగా భోజనం అందించాలని సత్యేంద్రజైన్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

తాను అరెస్టైన మే 31వ తేదీ నుండి ప్రాథమిక ఆహారం, మందులు నిరాకరిస్తున్నారని మంత్రి సత్యేంద్రజైన్ ఆరోపించారు.గత 12 రోజులుగా జైలు అధికారులు తమ మత విశ్వాసాల ప్రకారంగా బోజనం అందించడం లేదని కూడా మంత్రి ఆరోపించారు. మంత్రి సత్యేంద్ర జైన్ జైన మతాచారం ప్రకారంగా భోజనం తీసుకుంటారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దాదాపుగా ఆరు మాసాలుగా పండ్లు, కూరగాయాలు , డ్రైఫ్రూట్స్, ఖర్జూరాలను మాత్రమే మంత్రి తీసుకుంటున్నారని న్యాయవాది చెప్పారు. తన స్వంత రేషన్ కోటా నుండి మంత్రి ఈ ఆహారం తీసుకుంటున్నారని న్యాయవాది తెలిపారు. జైలులోనే మంత్రి వెన్నెముకకు గాయమైందన్నారు.ఈ విషయమై ఎల్ఎన్ జెపీ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. కరోనా తర్వాత సత్యేంద్రజైన్ కు ఊపిరితిత్తుల వ్యాధి సోకిందని కూడా కోర్టుకు న్యాయవాది వివరించారు.

also read:రేప్ కేసు నిందితుడు రింకు:ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్ కి జైలులో మసాజ్

పండ్లు,కూరగాయలు, ఖర్జూరాలు, డ్రైఫ్రూట్స్ నిలిపివేశారని మంత్రి కోర్టుకు తెలిపారు. అయితే వీటిని అందించాల్సిన అవసరం ఉందని కూడా వైద్యులు సూచించిన విషయాన్ని మంత్రి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తన మత విశ్వాసాల ప్రకారంగా ఆహారం అందించాలని కోర్టులో సత్యేంద్రజైన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై ఈడీ ప్రతిస్పందనను కోర్టు కోరింది. 

 ఇటీవలనే తన జైలు గదిలో మంత్రి సత్యేంద్ర జైన్ మసాజ్ చేయించుకుంటున్న వీడియో వెలుగు చూసింది. ఈ విషయమై బీజేపీ ఆప్ పై తీవ్ర విమర్శలు చేసింది. ఫిజియోథెరపి చేయించుకుంటున్నారని ఆప్ ఈ ఘటనను కవర్ చేసే ప్రయత్నం చేసింది. అయితే మంత్రికి మసాజ్ చేసిన వ్యక్తి ఫిజియోథెరపిస్టు కాదని జైలు అధికారులు తేల్చాచు. ఇదే జైలులో శిక్షను అనుభవిస్తున్న రింకు మసాజ్ చేసినట్టుగా అధికారులు తేల్చారు.