చెన్నైలో రూ. 20కోట్ల నగల దోపిడీలో ట్విస్ట్.. ఇన్ స్పెక్టర్ ఇంట్లో 3.7 కిలోల బంగారం..!
చెన్నైలో కలకలం సృష్టించిన ఎన్బీఎఫ్సీ బ్యాంక్ దోపిడీ కేసులో ఊహించని ట్విస్ వెలుగులోకి వచ్చింది. పోలీస్ ఇన్ స్పెక్టర్ ఇంట్లో నుంచి 3.7కిలోల బంగారు ఆభరణాలను రికవర్ చేశారు. ఇన్ స్పెక్టర్ ను, ఆయన భార్యను అరెస్ట్ చేశారు.
చెన్నై : ఈ వార్త వింటే కంచె చేను మేసిన సామెత గుర్తుకు వస్తుంది. ఇందులో వాస్తవాలు ఇంకా తెలియాల్సి ఉంది. అసలు విషయం ఏంటంటే..తమిళనాడు రాజధాని చెన్నైలో గతవారం ఓ ఆభరణాల లోన్ సంస్థ లో భారీ దోపిడీ జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే సంస్థ ఆఫీస్ లోకి చొరబడిన దుండగులు సిబ్బందిని బెదిరించి, రూ. కోట్ల విలువైన నగలను ఎత్తుకుపోయారు. అయితే ఈ కేసు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. దోపిడీ చేసిన నగల్లో కొన్ని స్థానిక ఇన్స్పెక్టర్ ఇంట్లో లభించడం కలకలం రేపుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇన్స్పెక్టర్ ఇంటి నుంచి 3.7 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే…
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్ బీఎఫ్సీ) ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కు చెన్నైలోని అరుంబాక్కంలో ఓ బ్రాంచ్ ఉంది. ఆగస్టు 13న మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఈ బ్రాంచీలోకి కొందరు దుండగులు చొరబడ్డారు. సిబ్బంది, కస్టమర్లను కత్తులతో బెదిరించి తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత ఇరవై కోట్ల రూపాయల విలువైన నగలు, నగదు దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా… స్టేట్ బ్యాంకులో పని చేసే వ్యక్తులే దోపిడీకి పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.
చెన్నైలో భారీ చోరీ.. బ్యాంక్లో రూ.20 కోట్ల అపహరణ, ఇంటి దొంగల పనిగా అనుమానం
ప్రధాన నిందితుడుగా మురుగన్ అనే వ్యక్తి ఉన్నట్లు అనుమానించారు. నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఘటన జరిగిన మరుసటి రోజే సంతోష్, బాలాజీ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 8.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాతి రోజు మురుగన్, మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. అయితే విచారణలో నిందితుడు సంతోష్ కీలక సమాచారం అందించాడు. దోచుకున్న నగల్లో కొన్నింటిని అచరపాక్కమ్ ఇన్స్పెక్టర్ అమల్ రాజ్ ఇంట్లో దాచి పెట్టినట్లు తెలిపాడు.
అంతేకాక నిందితుడు సంతోష్ అమల్రాజ్ భార్యకు బంధువు కావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. గురువారం ఇన్స్పెక్టర్ ఇంట్లో సోదాలు జరగగా 3.7 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో అమల్ రాజ్, ఆయన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ దోపిడీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇన్స్పెక్టర్ చెబుతున్నారు. ఘటన జరిగిన రాత్రి సంతోష్ తమ ఇంటికి వచ్చాడని, అతడి వద్ద బంగారం ఉన్నట్లు తమకు తెలియదని అన్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.