ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ స్పూర్తి : కొత్త పార్లమెంట్ నిర్మాణం కోసం ఏయే ప్రాంతాల నుంచి ఏం తెప్పించారంటే..?
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ బృహత్తర కార్యక్రమం కోసం దేశంలోని పలు ప్రఖ్యాత ప్రాంతాల నుంచి ఇసుక, మార్బుల్స్, కలప వంటి మెటీరియల్ను తెప్పించారు.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో మరో అధ్యాయం మొదలుకాబోతోంది. అన్ని హంగులతో , ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోడీ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కొందరు విపక్ష నేతలు దూరంగా వుంటున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగం ప్రకారం .. ప్రధాని మోడీ శాసన వ్యవస్థలో భాగం కాదని, ఆయన కార్యనిర్వాహక వ్యవస్థకు చెందిన వ్యక్తని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి ప్రారంభిస్తేనే ఈ కార్యక్రమానికి తాము హాజరవుతామని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి.
ఈ సంగతి పక్కనబెడితే.. కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించాలన్న ఉద్దేశ్యమే ఒక బృహత్తర ప్రయత్నం. దీని నిర్మాణంలో దేశం నలుమూలల నుంచి లభించిన మెటీరియల్ను ఉపయోగించారు. ఒక విధంగా, ప్రజాస్వామ్య దేవాలయాన్ని నిర్మించడానికి దేశం మొత్తం ఏకతాటిపైకి రావడానికి ఇది నిదర్శనంగా నిలిచింది. తద్వారా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యొక్క నిజమైన స్ఫూర్తిని చాటుతుంది. కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం, ప్రారంభోత్సవంలో అనేక వింతలు, విశేషాలు, ప్రత్యేకతలు వుండేలా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. దీనిలో భాగంగా ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న రాజదండం (సెంగోల్) ఇప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచింది.
- పార్లమెంట్ భవన నిర్మాణం కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రఖ్యాతి గాంచిన ముడి పదార్ధాలను వినియోగించారు. అవేంటో ఒకసారి చూస్తే:
- మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి టేకు కలపను తీసుకొచ్చారు.
- ఇసుకరాయి (ఎరుపు & తెలుపు) రాజస్థాన్లోని సర్మతుర నుండి సేకరించారు.
- యూపీలోని మీర్జాపూర్ నుండి కార్పెట్లు తెప్పించారు
- త్రిపురలోని అగర్తల నుండి వెదురు చెక్క ఫ్లోరింగ్
- రాజస్థాన్లోని రాజ్ నగర్ నుంచి స్టోన్ జాలీ వర్క్స్ యూపీలోని నోయిడాకు రప్పించారు
- మహారాష్ట్రలోని ఔరంగాబాద్, రాజస్థాన్లోని జైపూర్ నుంచి అశోక్ చిహ్నాన్ని సేకరించారు
- మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి అశోక చక్రం
- ముంబైలో కొంత ఫర్నిచర్ కొనుగోలు
- లాఖా రెడ్ (ఎరుపు రంగు మార్బుల్)ను జైసల్మేర్లోని లాఖా నుంచి తెప్పించారు
- రాజస్థాన్లోని అంబాజీ నుంచి అంబాజీ వైట్ మార్బుల్ తెప్పించారు.
- ఉదయ్పూర్ నుంచి కేశారియా గ్రీన్ స్టోన్ను కొనుగోలు చేశారు
- స్టోన్ కార్వింగ్ వర్క్ను అబు రోడ్, ఉదయ్పూర్లలో చేయించారు. దీనికి సంబంధించిన రాయి రాజస్థాన్లోని కోట్పుట్లీ నుంచి తెప్పించారు.
- ఎం శాండ్ను హర్యానాలోని చకారి దాద్రీ నుంచి.. ఫ్లై యాష్ బ్రిక్స్ను హర్యానా, ఉత్తరప్రదేశ్ల నుంచి సేకరించారు.
- ఇత్తడి పని, ప్రీ కాస్ట్ ట్రెంచ్లను గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి సేకరించారు. లోక్సభ, రాజ్యసభలలోని ఫాల్స్ సీలింగ్ స్టీల్ స్ట్రక్చర్ను కేంద్ర పాలిత ప్రాంతం డామన్ అండ్ డయ్యూ నుంచి తెప్పించారు.