ఇక ఏడాదికి రెండుసార్లు నీట్ ప్రవేశపరీక్ష: జవదేకర్
ఈ విద్యా సంవత్సరం నుండి ఏడాదికి రెండు సార్లు నీట్ ప్రవేశపరీక్షలను నిర్వహిించనున్నట్టు కేంద్ర హెచ్ఆర్డి మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు.అయితే రెండు దఫాల్లో ఏదైనా ఒక్కసారి మాత్రమే ఒక్క అభ్యర్ధి పరీక్ష రాసే అవకాశం ఉంటుందని ఆయన ప్రకటించారు.
న్యూఢిల్లీ: నీట్, జేఈఈ ఇకపై ఏడాదికి రెండుసార్లు నిర్వహించనున్నట్టు కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. ఏడాదిలో రెండు సార్లు ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే తమ వెసులుబాటును బట్టి విద్యార్ధులు ఈ పరీక్షలు రాసుకోవచ్చని ఆయన ప్రకటించారు.
శనివారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను విద్యార్ధులకు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
ఈ విద్యాసంవత్సరం నుండే ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తమ వెసులుబాటును బట్టి విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరు కావొచ్చని ఆయన చెప్పారు. అయితే ఏడాదిలో రెండు దఫాలు ప్రవేశపరీక్షలు జరిగినా... ఒక విద్యార్ధి ఒకే సారి మాత్రమే పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
ఈ ఏడాది డిసెంబర్ లో జేఈఈ నిర్వహించనున్నట్టు చెప్పారు. జేఈఈ మెయిన్స్ ను జనవరి మాసంలో నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. నీట్ ను ఈ విద్యాసంవత్సరం నుండి రెండు దఫాలు నిర్వహించాలని భావిస్తున్నందున ఫిబ్రవరి , మే మాసాల్లో నిర్వహించాలని భావిస్తున్నారు.అయితే ఈ పరీక్షలకు సంబంధించిన సిలబస్ ప్రశ్నల ఫార్మాట్, భాష, ఫీజు విధానంలో ఎలాంటి మార్పులు లేవని ఆయన ప్రకటించారు.