'మనమంతా ప్రజా సేవకులం...' లోక్ సభలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
New Delhi: లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గురించి ప్రస్తావిస్తూ.. మైళ్లు నడిచే పాత సంప్రదాయాన్ని మనం మరచిపోయామని అన్నారు. భారత్ జోడో యాత్ర నుంచి చాలా నేర్చుకున్నామని తెలిపారు. మనమంతా ప్రజా సేవకులమని పేర్కొన్న ఆయన.. భారత్ జోడో యాత్ర మమ్మల్ని ప్రజలతో మరింత లోతైన బంధంతో కలిపిందని చెప్పారు.

Congress leader Rahul Gandhi in Lok Sabha: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మనమంతా ప్రజా సేవకులం అంటూ లోక్ సభను ఉద్దేశించి అన్నారు. భారత్ జోడో యాత్రను గుర్తుచేస్తూ.. మైళ్లు నడిచే పాత సంప్రదాయాన్ని మనం మరచిపోయామని అన్నారు. భారత్ జోడో యాత్ర నుంచి చాలా నేర్చుకున్నామని తెలిపారు. మనమంతా ప్రజా సేవకులమని పేర్కొన్న ఆయన.. భారత్ జోడో యాత్ర మమ్మల్ని ప్రజలతో మరింత లోతైన బంధంతో కలిపిందని చెప్పారు. అలాగే, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అగ్నిపథ్ పథకం, పేదరికం, అదానీ అంశాలను లేవనెత్తుతూ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
అదానీ ఇప్పుడు 8-10 రంగాల్లో ఉన్నారనీ, 2014-2022 మధ్య 8 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన నికర విలువ 140 బిలియన్ డాలర్లకు ఎలా చేరిందని యువత మమ్మల్ని ప్రశ్నించింది. తమిళనాడు, కేరళ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు ఎక్కడ చూసినా 'అదానీ' అనే పేరు వినిపిస్తోంది. దేశమంతా కేవలం 'అదానీ', 'అదానీ', 'అదానీ'... అదానీ ఇంకా ఏదైనా వ్యాపారంలోకి ప్రవేశిస్తారా అని ప్రజలు నన్ను అడిగేవారు, ఎందుకు ఆయన ఎప్పుడూ విఫలం కాలేదు అని కూడా అడిగారు : లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
బిలియనీర్లకు లబ్ధి చేకూర్చేలా భారత విదేశాంగ విధానాన్ని మార్చారు..
గత ఎనిమిదేళ్లలో గౌతమ్ అదానీ ఎదుగుదలను ప్రశ్నించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, వ్యాపారవేత్తతో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. అదానీ గ్రూపును వివిధ వ్యాపారాల్లోకి అనుమతించడానికి నిబంధనలను వక్రీకరించారని లేదా మార్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విమానాశ్రయాల్లో అనుభవం ఉన్న ఒక కంపెనీ/వ్యక్తికి మాత్రమే వాటిని అభివృద్ధి చేసే బాధ్యతను అప్పగించాలనే నిబంధనను మార్చి, ఆరు విమానాశ్రయాలను అదానీకి అప్పగించారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. బిలియనీర్లకు లబ్ధి చేకూర్చేలా భారత విదేశాంగ విధానాన్ని రూపొందిస్తున్నారని ఆరోపించారు.
అదానీకి రక్షణ రంగంలో అనుభవం లేదు..: రాహుల్ గాంధీ
"ఇప్పుడు అదానీకి రక్షణ రంగంలో అనుభవం లేదు. నిన్న హెచ్ఏఎల్ లో ప్రధాని మాట్లాడుతూ.. మేం తప్పుడు ఆరోపణలు చేశాం. కానీ వాస్తవానికి 126 విమానాల కాంట్రాక్టు అనిల్ అంబానీకి దక్కింది" అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. అలాగే, 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విమానయాన రంగంలో అనుభవం ఉన్న కంపెనీ/వ్యక్తికి మాత్రమే విమానాశ్రయాల అభివృద్ధి బాధ్యతలను అప్పగించాలనే నిబంధనను మార్చిందని రాహుల్ గాంధీ విమర్శించారు. "ఆ తర్వాత ఆరు విమానాశ్రయాలను అదానీకి అప్పగించారు. అప్పుడు భారతదేశంలో అత్యంత లాభదాయకమైన విమానాశ్రయం ముంబయి విమానాశ్రయాన్ని సీబీఐ, ఈడీ వంటి సంస్థలను ఉపయోగించి జీవీకే నుండి హైజాక్ చేశారనీ, దీనిని భారత ప్రభుత్వం అదానీకి ఇచ్చిందని, దీనికి ఈ దేశ ప్రధాని సహకరించారంటూ ఆరోపించారు.
అదానీ.. అదానీ.. అదానీ.. ఎలా..?
గౌతమ్ అదానీతో ప్రధాని మోడీ సంబంధాలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ, గౌతమ్ అదానీల మధ్య సంబంధాలు చాలా ఏళ్ల క్రితం నాటిదనీ, ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమయ్యాయని రాహుల్ గాంధీ లోక్ సభలో అన్నారు. 2014లో ప్రధాని మోడీ ఢిల్లీకి చేరుకోవడంతో నిజమైన మ్యాజిక్ మొదలైందన్నారు. "చాలా ఏళ్ల క్రితం నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు సంబంధాలు ప్రారంభమయ్యాయి. ఒక వ్యక్తి ప్రధాని మోడీతో భుజం భుజం కలిపి నిలబడ్డాడు.. ఆయన ప్రధానికి విధేయుడు.. 2014లో ప్రధాని మోడీ ఢిల్లీకి చేరుకోవడంతో నిజమైన మ్యాజిక్ ప్రారంభమైంది" అని రాహుల్ గాంధీ అన్నారు.