New Delhi: ఫిబ్రవరి 15న ఫిజీలో ప్రపంచ హిందీ సదస్సును ఆ దేశ ప్రధాన మంత్రి సితివేణి రబుకా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ కూడా పాలుపంచుకోనున్నారు. సదస్సు కోసం హిందీ పండితులు, అధికారులతో కూడిన 270 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఫిజీ వెళ్లనుంది.
World Hindi Conference: ప్రపంచ హిందీ సదస్సును ఫిజీ ప్రధాని ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 15న ఫిజీలో ప్రపంచ హిందీ సదస్సును ఆ దేశ ప్రధాన మంత్రి సితివేణి రబుకా ప్రారంభించనున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ కూడా పాలుపొంచుకోనున్నారు. సదస్సు కోసం హిందీ పండితులు, అధికారులతో కూడిన 270 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఫిజీ వెళ్లనుంది. కాగా, గత ఏడాది డిసెంబర్లో దక్షిణ పసిఫిక్ మహాసముద్ర ద్వీప దేశంలో కొత్త సంకీర్ణ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫిబ్రవరి 15 నుంచి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఫిజీలో తొలిసారి పర్యటించనున్నారు.
వివరాల్లోకెళ్తే.. 12వ ప్రపంచ హిందీ సదస్సును విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఫిజీ ప్రధాని సితివేణి రబుకా బుధవారం ఫిజీలోని నాడిలో ప్రారంభించనున్నారు. గత ఏడాది డిసెంబర్లో దక్షిణ పసిఫిక్ మహాసముద్ర ద్వీప దేశంలో కొత్త సంకీర్ణ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫిబ్రవరి 15 నుంచి జైశంకర్ ఫిజీలో పర్యటించడం ఇదే తొలిసారి. జైశంకర్ ఫిజియన్ నాయకత్వంలోని క్రాస్ సెక్షన్తో సమావేశాలు నిర్వహించి, ప్రధాన మంత్రి రబుకాతో కూడా సమావేశమవుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరభ్ కుమార్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు జరిగే ప్రపంచ హిందీ సదస్సులో జైశంకర్తో పాటు, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేనీ కూడా ప్రసంగించనున్నారు.
"హిందీ: సాంప్రదాయ జ్ఞానం నుండి కృత్రిమ మేధస్సు వరకు" అనే వ్యాఖ్యాన్ని ప్రపంచ హిందీ కాన్ఫరెన్స్ ప్రధాన థీమ్ గా ప్రకటించారు. కాన్ఫరెన్స్లో ప్లీనరీ సెషన్, ఫిజీ, పసిఫిక్లో హిందీ, గిర్మితియా దేశాలలో హిందీ వంటి అంశాలపై 10 సమాంతర సెషన్లు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 21వ శతాబ్దంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-హిందీ, మీడియా-హిందీపై ప్రపంచ అవగాహన, భారతీయ విజ్ఞాన సంప్రదాయాలు-హిందీ, ప్రపంచ సూచనలు-హిందీ, భాషాపరమైన సమన్వయం-హిందీ అనువాదం వంటి అంశాలపై సెషన్లు ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాన్ఫరెన్స్లో హిందీ సినిమా విభిన్న రూపాలు, ప్రపంచ దృశ్యాలపై సమాంతర సెషన్లు కూడా ఉంటాయి. ప్రపంచ మార్కెట్-హిందీ, మారుతున్న దృష్టాంతంలో ప్రవాసీ హిందీ సాహిత్యం, భారతదేశం-విదేశాలలో హిందీ బోధన, సవాళ్లు-పరిష్కారాలు వంటి అంశాలపై చర్చించనున్నారు.
ఈ సదస్సు కోసం హిందీ పండితులు, అధికారులతో కూడిన 270 మంది సభ్యుల బృందం ఫిజీకి వెళ్లనుంది. ఈ సదస్సులో 50 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరభ్ కుమార్ తెలిపారు. ఫిజీ ఉప ప్రధాని బిమన్ చంద్ ప్రసాద్ తన ఐదు రోజుల భారత పర్యటనను శుక్రవారం ముగించారు. తన పర్యటనలో, ప్రసాద్ బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్లో పాల్గొన్నారు. జైశంకర్తో ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపారు. గత ఏడాది డిసెంబరులో ఫిజీలో మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. మునుపటి ప్రధానమంత్రి ఫ్రాంక్ బైనిమరామ 16 ఏళ్ల ప్రభుత్వానికి ముగింపు పలికింది.
