టెక్ కంపెనీల లేఆఫ్ హడావుడి మధ్య జొమాటోలో 800 కొత్త ఉద్యోగాలు
New Delhi: టెక్ కంపెనీల లేఆఫ్ హడావుడి మధ్య జొమాటోలో 800 కొత్త ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. ప్రముఖ టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు బాట పట్టినప్పటికీ జొమాటో సంస్థలోని వివిధ బృందాల్లో 800 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇటీవల కంపెనీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు రాజీనామా చేశారు.
Zomato Announces 800 New Jobs: ప్రముఖ టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు బాట పట్టినప్పటికీ జొమాటో సంస్థలోని వివిధ బృందాల్లో 800 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇటీవల కంపెనీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు రాజీనామా చేశారు.
వివరాల్లోకెళ్తే.. ప్రపంచవ్యాప్తంగా టాప్ టెక్ కంపెనీలు ప్రస్తుతం ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. రానున్న ఆర్థిక మాంద్యం అంచనాల క్రమంలో ముందు జాగ్రత్త చర్యల నిమిత్తం ఉద్యోగులను తగ్గించుకుంటూ పొదుపు చర్యలు అంటూ లేఆఫ్ పై సదరు సంస్థలు స్పందిస్తున్నాయి. ఇలాంటి సమయంలో జొమాటో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దీపిందర్ గోయల్ సంస్థలోని కనీసం ఐదు వేర్వేరు విభాగాల్లో 800 ఉద్యోగావకాశాలను ప్రకటించారు. రిక్రూట్ మెంట్ కోసం అందుబాటులో ఉన్న కొన్ని పోస్టులలో ఇంజనీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, గ్రోత్ మేనేజర్లు వంటివి ఉన్నాయి.
వీటితో పాటు జనరలిస్ట్, ప్రొడక్ట్ ఓనర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్లకు చీఫ్ ఆఫ్ స్టాఫ్ ను నియమించే ప్రకటనలను సీఈవో పంచుకున్నారు. సంబంధిత వివరాలను పంచుకుంటూ లింక్డ్ ఇన్ లో ఓ పోస్టు చేశారు.
జోమాటో కంపెనీ ఇటీవలి కాలంలో అనేక ఉన్నత స్థాయి రాజీనామాలను చూసింది. దీని సహ వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గుంజన్ పాటిదార్ ఈ నెల ప్రారంభంలో రాజీనామా చేశారు. ఏఎన్ఐ నివేదిక ప్రకారం, మరొక సహ వ్యవస్థాపకుడు మోహిత్ గుప్తా, ఇనిషియేటివ్స్ హెడ్ రాహుల్ గంజూ గత ఏడాది నవంబర్లో కంపెనీని విడిచిపెట్టారు. గత ఏడాది మార్చిలో బెంగళూరు, గురుగ్రామ్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో పైలట్ ప్రాతిపదికన 10 నిమిషాల ఫుడ్ డెలివరీ పాలసీని అమలు చేయడానికి ప్రణాళికలను ప్రకటించిన తర్వాత, Zomato సోమవారం ఈ ప్లాన్ను ఇటీవల రద్దు చేసింది. Zomato ప్రస్తుతం దాని రెస్టారెంట్ భాగస్వాములతో రీబ్రాండింగ్, కొత్త మెనూలపై పని చేస్తోంది.
ఇదిలావుండగా, రానున్న ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాలపై పెను ప్రభావం చూపబోతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు ఆర్థిక మాంద్యం వస్తుందనే భయాందోళన అంచనాల మధ్య తమ ఉద్యోగులను తగ్గించుకునే చర్యలు చేపట్టాయి. వాటిలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, షేర్ చాట్, గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో మ్యూజిక్ స్ట్రీమింగ్ దిగ్గజం స్పాటిఫై (Spotify) చేరింది. స్పాటిఫై (Spotify) తన వర్క్ఫోర్స్లో 6 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
తాజాగా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. అలాగే, అమెజాన్ వివిధ దశల్లో దాదాపు 2,300 మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికలు ప్రకటించింది. అదేవిధంగా, మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా పరిగణించబడుతుంది. గత జూన్ నాటి డేటా ప్రకారం, వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల 21 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం మంది అంటే 11 వేల మందిని ఏకంగా తొలగించబోతున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది అక్టోబర్లో మైక్రోసాఫ్ట్ దాదాపు 1,000 మందిని తొలగించినట్లు సమాచారం. ప్రపంచ ఆర్థిక మందగమనం కారణంగా, ట్విట్టర్, మెటా వంటి అనేక కంపెనీలు ఇప్పటికే లేఆఫ్లు ప్రకటించాయి. సిస్కో 4000 మంది ఉద్యోగులను తొలగించింది. అదేవిధంగా ఓయో కూడా 600 మందిని తొలగించింది.