Venkaiah Naidu: గవర్నర్ పదవి అలంకారమూ కాదు రాజకీయమూ కాదు అని ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు అన్నారు. ప్రభుత్వం అందించే కార్యక్రమాలను రాష్ట్రాలు సక్రమంగా అమలు చేసేలా చూడాలని గవర్నర్‌లకు విజ్ఞప్తి చేశారు. 

Vice President Venkaiah Naidu: మరో నెల రోజుల్లో తన పదవీకాలం ముగియననున్న క్రమంలో ఉప‌రాష్ట్రప‌తి ఎం.వెంక‌య్య నాయుడు.. గ‌వ‌ర్న‌ర్ల గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గవర్నర్లు రాష్ట్రాలకు ఒక దిక్సూచిలా పని చేయాలని పేర్కొన్న ఆయ‌న గవర్నర్ పదవి అనేది అలంకారప్రాయమో లేదా రాజకీయ హోదానో కాదంటూ వ్యాఖ్యానించారు. దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో నిర్వహించిన సమావేశంలో వెంక‌య్య నాయుడు మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. గవర్నర్లు రాష్ట్రాలకు 'మార్గదర్శిగా' వ్యవహరించాలని పిలుపునిచ్చారు. గవర్నర్ కార్యాలయ అధినేత అనేది "అలంకారమైన పదవి లేదా రాజకీయ పదవి కాదు" అని అన్నారు. ప్రభుత్వం అందించే కార్యక్రమాలను రాష్ట్రాలు సక్రమంగా అమలు చేసేలా చూడాలని గవర్నర్‌లకు విజ్ఞప్తి చేశారు. వారి ప్రవర్తన రాష్ట్ర పరిపాలనకు ఉదాహరణగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. గ‌వ‌ర్న‌ర్లు స‌మ‌యం కేటాయించుకుని మ‌రీ వీలైన‌న్ని ఎక్కువ విశ్వ‌విద్యాల‌యాల‌ను త‌ర‌చుగా సంద‌ర్శించాల‌ని కోరారు. విశ్వవిద్యాలయాలు సంద‌ర్శించ‌డంతో పాటు విద్యార్థులు, అక్కడి సిబ్బందిని ప్రోత్సహించడానికి వారితో సంభాషించాల‌ని సూచించారు. జాతీయ విద్యా విధానం 2020 అమలును పర్యవేక్షించాలని కూడా ఆయన సూచించారు.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో క్షయవ్యాధి నిర్మూలన, ఇతర ఆరోగ్య అవగాహన కార్యక్రమాలలో గవర్నర్లు కూడా ముఖ్యమైన భాగస్వాములు కావచ్చని ఆయన సూచించారు. క‌రోనా వ్యాక్సినేష‌న్ టీకా కవరేజ్ ఉదాహరణను ఉటంకిస్తూ, టీకాలు వేయడానికి ప్రజలను ప్రేరేపించడం వల్ల సానుకూల ఫలితాలు వచ్చాయ‌నీ, దీని కార‌ణంగా భారతదేశంలో కోవిడ్‌-19 మరణాలు తగ్గాచ‌ని తెలిపారు. వివిధ టీకా ప్రచారాల్లో గవర్నర్లు భాగస్వాములు కావాలనీ, ప్రజలతో వారి పరస్పర చర్యలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యతను నొక్కి చెప్పాలని ఆయన సూచించారు. ఉప‌రాష్ట్రప‌తి ఏర్నాటు చేసిన ఈ స‌మావేశానికి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు, వారి జీవిత భాగస్వాములు, హోంమంత్రి అమిత్ షా, సీనియర్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు లంచ్‌లో పాల్గొన్నారని ఒక మీడియా ప్రకటన పేర్కొంది. రాజ్యసభ ఛైర్మన్ ఉన్న వెంక‌య్య నాయుడు.. సోమ‌వారం నుంచి జరగబోయే పార్ల‌మెంట్ సెషన్‌లోని ఎజెండాపై చర్చించేందుకు జరిగిన అఖిలపక్ష సమావేశంలో వీడ్కోలు బహుమతిగా పార్లమెంటు వర్షాకాల సమావేశాన్ని మంచిగా నిర్వహించాలని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

కాగా, నేడు (సోమ‌వారం) ప్రారంభం కానున్న పార్ల‌మెంట్ వ‌ర్షాకాల సమావేశానికి ప్రతిపక్షం 16 అంశాలను జాబితా చేసింది. ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి 41 మంది నాయకులు, మంత్రులు హాజరైన రికార్డు ఉంది. ఈ క్ర‌మంలోనే ఈ స‌మావేశాలు అర్థ‌వంత‌మైన‌విగా.. ఉత్పాద‌క‌మైన‌విగా జ‌రిపి విడ్కోలు బ‌హుమ‌తిని అందించాల‌ని కోరారు. అప్పట్లో కేబినెట్ మంత్రి అయిన వెంకయ్య నాయుడును 2017లో బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ఎన్నికలలో సునాయాసంగా విజయం సాధించారు. ఆయన ప్రస్తుత పదవీకాలం ఆగస్టు 10తో ముగుస్తుంది. ఈసారి ఉపరాష్ట్రపతి పదవికి అధికార ఎన్డీయే అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధంకర్ ఉన్నారు. విపక్షాల తరఫున మార్గరేట్ అల్వా బరిలో ఉన్నారు.