అంత్యక్రియల్లో హాజరుకాలేదని పొరుగింటివారిపై కత్తితో దాడి.. మహిళ మృతి
ముంబయిలో ఓ వ్యక్తి తన అన్న అంత్యక్రియలకు హాజరు కాలేదని పొరుగింటిపైకి కత్తితో వెళ్లాడు. ఇంటిలోని మహిళలపై దాడికి దిగాడు. ఒకరు మరణించగా.. మరొకరు తీవ్ర గాయాలపాలైంది.
ముంబయి: శుభకార్యాలకు అంతా ఇంటికి వస్తే సందడిగా ఉంటుందని, దానికదే ఒక పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటుందని అందరూ అనుకుంటారు. అది నిజం కూడా. కానీ, విషాద సమయాల్లోనూ అందరూ రావాలనే కోరిక కంటే ఆ బాధే మనసంతా నిండి ఉంటుంది. అప్పుడు ఆప్తులు తమకు అండగా నిలబడాలని కోరుకుంటారు. కానీ, ముంబయికి చెందిన కృష్ణ పవార్ లెక్క మాత్రం వేరు. విషాద సమయాల్లోనూ పొరుగింటి వారు కూడా హాజరు కావాలని బలంగా అనుకుంటాడు. వారు రాలేదన్న కారణంతోనే ఇంట్లోకి వెళ్లి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా.. మరో మహిళ తీవ్ర గాయాలపాలైంది.
ముంబయిలోని ఘాట్కోపర్లో నివసించే కృష్ణ పవార్కు అన్నయ్య ఉన్నాడు. మంగళవారం అతడి సోదరుడు మరణించాడు. అదే రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఇదంతా జరుగుతున్నా.. పొరుగునే ఉండే అంజలీ భోసాలే కుటుంబం మాత్రం ఇక్కడకు రాలేదు. ఇది కృష్ణ పవార్ను ఎక్కువగా బాధించింది.
అన్న అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజు కృష్ణ పవార్ చేతిలో కత్తి పట్టుకుని అంజలీ భోసాలే ఇంటికి వెళ్లాడు. అంజలి తల్లిపై కత్తితో దాడికి వెళ్లాడు. ఈ దాడిని అడ్డుకోవడానికి అంజలి సోదరి వెళ్లింది. ఆమె పైనా విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె స్పాట్లోనే మరణించింది. ఆమె తల్లి కూడా తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతున్నది.
ఈ ఘటనపై అంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగారు. హత్యా, హత్యాప్రయత్నం ఆరోపణలపై కృష్ణ పవార్, ఆయన భార్య, మరో దంపతులపై ఈ కేసు నమోదైంది. నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. కేసులో దర్యాప్తు కూడా ప్రారంభించినట్టు వివరించారు.