ప్రతిపక్షాల రెండో సమావేశ వేదికను మార్చుకున్నాయి. పట్నాలో భేటీ విజయవంతమైన తర్వాత రెండో సమావేశం హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో నిర్వహిస్తామని ప్రకటించాయి. కానీ, తాజాగా, ఈ వేదికను బెంగుళూరుకు షిఫ్ట్ చేసినట్టు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వెల్లడించారు.
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల పట్నా సమావేశం విజయవంతమైంది. రెండో భేటీలో కీలక అంశాలపై నిర్ణయాలు జరగనున్నాయి. ఈ రెండో సమావేశం హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి. అయితే, తాజాగా, ఈ సమావేశ వేదిక మార్చే నిర్ణయం తీసుకున్నట్టు ఎన్సీపీ చీఫ్, సీనియర్ లీడర్ శరద్ పవార్ వెల్లడించారు.
శరద్ పవార్ పూణెలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. విపక్షాల రెండో సమావేశం కర్ణాటక రాజధాని బెంగళూరులో వచ్చే నెల 13వ తేదీ, 14వ తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. కొందరు నేతలను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వివరించారు.
వచ్చే నెల మధ్యలో వర్షాలు ఉధృతంగా కురుస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్లో సమావేశ నిర్వహణ సరైన నిర్ణయం కాకపోవచ్చనే అభిప్రాయానికి ప్రతిపక్షాలు వచ్చాయి. వాతావరణ పరిస్థితులు కారణంగా అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. భూపాతాలూ చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో హిమాచల్ ప్రదేశ్కు విపక్ష పార్టీల ప్రతినిధులు హాజరు కావడం ఇబ్బందే అని కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కొందరు విపక్ష నేతల ప్రైవేట్ జెట్లు, చార్టర్డ్ ఫ్లైట్స్లలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వారు ఈ సమావేశానికి హాజరు కావడం దుర్భరంగా మారుతుందని ఆ వర్గాలు తెలిపాయి. అందుకే వేదికను మార్చే నిర్ణయం తీసుకున్నారు.
Also Read: మేమంతా కలిసే పోటీ చేస్తాం: పాట్నా సమావేశం అనంతరం విపక్షాలు.. సిమ్లా భేటీలో తుది నిర్ణయాలు
కొందరు ప్రతిపక్ష నేతలు సిమ్లా కాదనుకుంటే కాంగ్రెస్ అధికారంలోని రాజస్తాన్ రాజధాని జైపూర్లో నిర్వహించాలనీ ప్రతిపాదించినట్టు కోరారని తెలిసింది. ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రంలో ప్రతిక్షాల భేటీతో ఓటర్ల ముందు బల ప్రదర్శన చేసినట్టుగానూ ఉండేదని ఆ నేతలు అభిప్రాయపడ్డారని ఆ వర్గాలు వివరించాయి. కానీ, చివరకు ఈ వేదికను బెంగళూరుకు తరలించారు. ఇటీవలే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
