కేకులు, బ్రౌనీల్లో డ్రగ్స్.. రెయిన్ బో స్పెషల్ అంటూ అమ్మకం.. సైకాలజిస్ట్ అరెస్ట్...!
ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు సోదాలు నిర్వహించగా.. కేకులు, బ్రౌనీల్లో డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నాడని, వాటిని రేవ్ పార్టీలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
ముంబయి : మనుషుల మనస్తత్వం, ప్రవర్తనపై అధ్యయనం చేసి వారి సమస్యల్ని తీర్చాల్నిన ఓ సైకాలజిస్ట్... డబ్బు కోసం అడ్డదారిలో వెళ్లి పోలీసులకు చిక్కాడు. ముంబైలోని ఓ ఆసుపత్రిలో సైకాలజిస్ట్ గా పని చేస్తున్న రహమాన్ శరణ్ (25) ఓ బేకరీ ప్రారంభించి కేకు ల్లో డ్రగ్స్ పెట్టి సరఫరా చేస్తూ దొరికిపోయాడు.
ఇటీవల ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు సోదాలు నిర్వహించగా.. కేకులు, బ్రౌనీల్లో డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నాడని, వాటిని రేవ్ పార్టీలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
దీనిపై ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ మాట్లాడుతూ.. చూడడానికి కేకుల్లా కనిపించినా ఇందులో డ్రగ్స్ నింపాడు. అవన్నీ ప్యాక్ చేసి డెలివరీకి సిద్ధంగా ఉన్నాయి. అలా పది కిలోల కేకుల్లో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించాం. జనాలను ఆకట్టుకునేందుకు రెయిన్బో కేకులని చెప్పి.. వాటిని తయారు చేసే మైదాపిండిలో మాదకద్రవ్యాలను కలిపాడు. అతని ఇంట్లో కూడా రూ. 1.7 లక్షల విలువచేసే ఓపీఎమ్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నాం.. అని వివరించారు.
డాక్టర్ పై కోపం.. ఆమె నుదిటిన సింధూరం దిద్దిన కాంపౌండర్..!
విచారణలో భాగంగా నిందితుడిని పోలీసులు ప్రశ్నించగా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. నేను ఎక్కువగా ఓటీటీలో వచ్చే అంతర్జాతీయ వెబ్ సిరీస్ చూస్తాను. అందులో డ్రగ్స్ సరఫరా చేయడం పరిశీలించి ఆ మార్గాన్ని ఇక్కడ అనుసరించా అంటూ చెప్పుకొచ్చాడు. డ్రగ్స్ విక్రయానికి సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఆర్డర్లు స్వీకరించేవాడు.
సౌత్, వెస్ట్ ముంబైలో వ్యాపారాన్ని విస్తృతం చేసి రమ్ జాన్ షేక్ అనే వ్యక్తిని సహాయకుడిగా నియమించుకోగా.. పోలీసులు అతడిని కూడా పట్టుకున్నారు. అయితే కేకుల రూపంలో డ్రగ్స్ వ్యాపారం చేయడం కొత్త కాదని గతంలో పశ్చిమ ముంబైలో నిర్వహించిన సోదాల్లో కొందరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
సదరు సైకాలజిస్టు కాలేజీ రోజుల్లో డ్రగ్స్ వ్యాపారం చేసే వాడిని, డబ్బు సంపాదించాలని ఆశ పెరగడంతో అక్రమంగా సంపాదించేందుకు గతంలో చేసిన డ్రగ్స్ వ్యాపారాన్ని మళ్ళీ ఎంచుకున్నాడని వివరించారు.