‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్యలు.. అధిర్ రంజన్కు జాతీయ మహిళా కమీషన్ నోటీసులు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి పై జాతీయ మహిళా కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిలో భాగంగా ఆయనకు నోటీసులు పంపింది.
కాంగ్రెస్ (congress) నేత అధిర్ రంజన్ చౌదరికి (Adhir Ranjan Chowdhury) జాతీయ మహిళా కమీషన్ (National Commission for Women ) నోటీసులు జారీ చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈ నోటీసులు ఇచ్చింది. ‘‘ రాష్ట్రపత్ని’’ వ్యాఖ్యలకు గాను లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఎన్సీడబ్ల్యూ (ncw) ఆదేశించింది. ఇందుకు ఆగస్ట్ 3 ఉదయం 11.30 గంటల వరకు గడువు విధించింది. మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి (sonia gandhi) కూడా మహిళా కమీషన్ లేఖ రాసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని.. అధిర్ రంజన్ చౌదరి చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఎన్సీడబ్ల్యూతో పాటు 13 రాష్ట్ర మహిళా కమీషన్లు కూడా ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
ఇకపోతే... రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ‘రాష్ట్రపత్ని’గా పేర్కొన్నందుకు తన తప్పును అంగీకరిస్తున్నాని కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. తాను రాష్ట్రపతికి క్షమాపణలు చెబుతానని అన్నారు. తాను బెంగాలీ వాడినని, హిందీ అలవాటు లేదని తెలిపారు. రాష్ట్రపతిని తాను స్వయంగా కలిసి క్షమించాలని కోరుతానని అన్నారు. కానీ ఈ 'పఖండీలకు' (కపటవాదులకు) క్షమాపణ చెప్పబోనని ఆయనను విమర్శించేవారిని ఉద్దేశించి అన్నారు.
ALso Read:నా తప్పును అంగీకరిస్తున్న.. ‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతాను : అధిర్ రంజన్ చౌదరి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని 'రాష్ట్రపత్ని' అని లోక్ సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఎంపీ అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్న తర్వాత బీజేపీ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ భారతదేశంలోని మహిళలు, గిరిజనులను కించపరిచింది అని పేర్కొంది. ‘‘ ఒక గిరిజన నాయకురాలిని అవమానించినందుకు మీరు దోషులుగా ఉన్నారు...ఒక గిరిజన మహిళకు ఇచ్చిన గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ సహించలేకపోతుంది. ఒక పేద గిరిజన మహిళ భారత రాష్ట్రపతి కావడాన్ని జీర్ణించుకోలేకపోతోంది” అని లోక్సభలో స్మృతి ఇరానీ అన్నారు.
సభ నేలపై, రాష్ట్రపతిపై అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో కోరారు. కాగా బీజేపీ ఆరోపణపై చౌదరి స్పందిస్తూ, “క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదు” అని చెప్పగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రంజన్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని అన్నారు.
ఇదిలా ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సందీప్ కుమార్ పాఠక్, సుశీల్ కుమార్ గుప్తా, ఇండిపెండెంట్ ఎంపీ అజిత్ కుమార్ భుయాన్లతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన మరో ముగ్గురు రాజ్యసభ ఎంపీలు గురువారం సస్పెన్షన్ కు గురయ్యారు. దీంతో ఈ పార్లమెంట్ సమావేశాల్లో సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 27కి చేరింది.