మహారాష్ట్ర సీఎంపై అనుచిత వ్యాఖ్యలు: పోలీసుల అదుపులో కేంద్ర మంత్రి నారాయణ్ రాణే
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మంత్రిపై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై శివసేన నేతలు మండిపడ్డారు.
ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేపై అనుచరిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
నారాయణ రాణే ప్రస్తుతం రత్నగిరి జిల్లాలోని సంగమేశ్వర్లోని గోల్వాలి అనే ప్రదేశంలో ఉన్నారు. ఆయనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే ప్రసాద్ లాడ్, రాణే కొడుకులు ఎమ్మెల్యే నితేష్ రాణే, నీలేష్ రాణేలున్నారు. రాణేను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాన్ని పంపినట్టుగా నాసిక్ పోలీస్ కమిషనర్ చెప్పారు.
ముంబైలోని జుహులోని మంత్రి నారాయణ్ రాణే నివాసం వెలుపల శివసేన సభ్యులు ఇవాళ నిరసనకు దిగారు. కేంద్ర మంత్ర రాణే మద్దతుదారులు, శివసేన సభ్యులు జుహులో ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. కేంద్ర మంత్రి ఇంటిపై సిరా, గుడ్లను విసిరారు శివసేన సభ్యులు. మలాడ్ ఈస్ట్ లో రాణేకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు ఆందోళనలు చేశారు. ఈ సమయంలో పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జీ చేశారు.
రత్నగిరి జిల్లాలో జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా సీఎం ఉద్దవ్ ఠాక్రేపై కేంద్ర మంత్రి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని కోరుతూ ఆయన ముంబై హైకోర్టును ఆశ్రయించారు. మహద్, పుణే, నాసిక్ లలో మూడు ఎఫ్ఐఆర్ లను రద్దు చేయాలని ఆయన కోరారు.తనను అరెస్ట్ చేయవద్దని కూడ ఆ పిటిషన్ లో ఆయన కోరారు. అత్యవసరంగా ఈ విషయమై విచారణను కోరారు .