అసెంబ్లీ వాయిదా : ప్రతిపక్షాల గందోరగోళం కాదు... కరెంట్ లేక
నాగపూర్లో జరుగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడ్డాయి. భారీ వర్షాల కారణంగా శాసనసభ ప్రాంగణంలో నీరు నిలిచిపోయింది.. కరెంట్ సరఫరా స్తంభించడంతో సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
మనదేశంలో అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగా జరగడం అరుదనే చెప్పవచ్చు. పాలక, ప్రతిపక్ష పార్టీలు బాహాబాహీకి దిగడానికి.. లేదంటే ఒకరి మీద ఒకరు బురదజల్లుకోవడానికే అసెంబ్లీలను వాడుతున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో సభ సజావుగా సాగడం అసాధ్యమే. అందుకే చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీలు వూరకే వాయిదా పడుతుంటాయి. అలాంటిది అందుకు భిన్నంగా కరెంట్ వల్ల అసెంబ్లీ వాయిదాపడితే..
మహారాష్ట్రలోని నాగ్పూర్లో శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే అంతకు ముందు నుంచే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్ర అతలాకుతలమవుతోంది. అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో పాటు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో నాగ్పూర్లో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు అసెంబ్లీ ప్రాంగణం మొత్తం నిండిపోయింది.
ఇవాళ ఉదయం సమావేశాలను నిర్వహించాలని స్పీకర్ హరిభావ్ భావించారు. అయితే వర్షాల కారణంగా కరెంట్ సరఫరాను నిలిపివేశారు. జనరేటర్లను ఉపయోగించి సభను నిర్వహించలేమని తేలడంతో అసెంబ్లీని గంటపాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు.
ఈ ఘటనతో ప్రభుత్వంపై శివసేన తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది... మున్సిపల్ అధికారులు సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని.. అందుకే ఇవాళ అసెంబ్లీ సమావేశాలు నిలిచిపోయాయని ఆ పార్టీ ఆరోపించింది. దీనిపై మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి చంద్రశేఖర్ స్పందిస్తూ.. డ్రైనేజ్ సమస్య వల్లే అసెంబ్లీలో ప్రాంగణంలో వర్షపు నీరు నిలిచిపోయిందని..ఇది రాష్ట్ర చరిత్రలోనే తొలిసారని అన్నారు.