నా భార్య దోమ కాట్ల వల్ల ఇబ్బంది పడుతోంది.. ఉత్తరప్రదేశ్ పోలీసులకు యువకుడి ఫిర్యాదు.. తరువాత ఏం జరిగిందంటే ?
తన భార్యను విపరీతంగా దోమలు కుడుతున్నాయని, దీంతో ఆమె ఇబ్బంది పడుతోందని ఓ యువకుడు యూపీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి పోలీసులు స్పందించారు. అతడికి మస్కిటో కాయిల్స్ అందించారు.
యూపీకి చెందిన ఓ యువకుడు పోలీసులకు ఓ వింత ఫిర్యాదు చేశాడు. తన భార్యను దోమలు విపరీతంగా కుడుతున్నాయని తెలిపాడు. దీని నుంచి ఉపమశనం పొందాలంటే వెంటనే తనకు మోర్టిన్ మస్కిటో కాయిల్స్ కావాలని కోరాడు. దీంతో పోలీసులు స్పందించారు. అతడికి వాటిని తెచ్చిచ్చారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉత్తరప్రదేశ్ లోని చందౌసిలోని ఓ హాస్పిటల్ లో అసద్ఖాన్ అనే యువకుడి భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అతడి భార్య ప్రసవానంతర వేదనతో పాటు దోమ కాటు కారణంగా మరింత నొప్పిని అనుభవించింది. దీనిని చూసి ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. వెంటనే బయటకు వెళ్లి మోర్టిన్ మస్కిటో కాయిల్స్ కోసం వెతికాడు. కానీ అప్పటికే అర్ధరాత్రి కావడంతో ఇక చివరి ప్రయత్నంగా పోలీసులను ఆశ్రయించాడు.
2012లో సైనిక తిరుగుబాటు యత్నం.. జనరల్ వీకే సింగ్ ఏమన్నారంటే..?
“నా భార్య ఈరోజు చందౌసిలోని హరి ప్రకాష్ నర్సింగ్ హోమ్ కూతురుకు జన్మనిచ్చింది. కానీ నా భార్య ఇక్కడ చాలా ఇబ్బంది పడుతోంది, ఎందుకంటే ఆమె ప్రసవం వల్ల నొప్పి వస్తోంది. దీంతో పాటు ఆమెను దోమలు కూడా విపరీతంగా కుడుతున్నాయి. దయచేసి నాకు అత్యవసరంగా మోర్టిన్ కాయిల్ అందించండి!’’ అని అసద్ఖాన్ ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కు సంభాల్ పోలీస్, డయల్ 112 యూపీ సర్వీస్ ను ట్యాగ్ చేశాడు.
అతడి విజ్ఞప్తిని యూపీ పోలీసులు అంగీకరించారు. మానవతావాదంతో యూపీ 112 సర్వీస్ సిబ్బంది మస్కిటో కాయిల్స్ తో హాస్పిటల్ కు చేరుకున్నారు. తన పరిస్థితిని చూసి వెంటనే స్పందించినందుకు అతడు ట్విట్టర్ ద్వారా యూపీ పోలీసులకు థ్యాంక్స్ చెప్పారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను యూపీ పోలీసుల అధికారిక ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అయితే దీనిని షేర్ చేసిన నాటి నుంచి ఈ పోస్ట్ కు ఇప్పటి వరకు 92,000 వ్యూవ్స్ వచ్చాయి. మానవత్వంతో వ్యవహరించినందుకు యూపీ పోలీసును నెటిజన్లు అభినందిస్తున్నారు.