హెలికాప్టర్ శబ్దానికి లక్షల విలువైన నా గేదె చనిపోయింది...పైలెట్ పై వృద్ధుడి ఫిర్యాదు...
హెలికాప్టర్ శబ్దానికి తన గేదె చనిపోయిందంటూ ఓ వృద్ధుడు పైలెట్ మీద పోలీస్ ప్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
రాజస్థాన్ : హెలికాప్టర్ శబ్దంతో తన గేదె చనిపోయిందని ఓ వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లాలో జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బల్జీత్ యాదవ్ రాక సందర్భంగా బహ్ రోడ్డులో కొందరు ఆయనను స్వాగతించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఆదివారం హెలికాప్టర్ నుంచి ఎమ్మెల్యే మీద పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆ హెలికాప్టర్ బహ్ రోడ్ ప్రాంతంలో చక్కర్లు కొట్టింది.
ఆ తరువాత కోహ్రానా అనే గ్రామం మీదుగా వెళ్లింది. తక్కువ ఎత్తులో ప్రయాణించటం వల్ల పెద్ద శబ్దం వచ్చింది. దాంతో రూ.1.5 లక్షల విలువైన తన గేదె మృతి చెందిందని ఆ గ్రామానికి చెందిన బల్వీర్.. పైలెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు చనిపోయిన గేదెను పరీక్ష నిమిత్తం పశువుల ఆస్పత్రికి తరలించారు. నివేదిక వచ్చాక దాన్ని ఆధారంగా కేసు నమోదు చేస్తామని వారు తెలిపారు.
గేదెకు దశదిన కర్మ.. గ్రామస్తులకు భోజనాలు.. ఓ జంతు ప్రేమికుడి నివాళి..
ఇదిలా ఉండగా, ఆగస్ట్ ఫస్ట్ న గుంటూరులో ఇలాంటి విచిత్ర ఘటనే చోటు చేసుకుంది. స్పందన కార్యక్రమంలో ఓ అర్జీదారుడి దెబ్బకు శానిటరీ సూపర్వైజర్.. రైతు గేదెలను తీసుకువచ్చి సచివాలయం వద్ద కట్టేయాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది. వింతగా ఉన్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని ఏటుకూరు ప్రాంతానికి చెందిన ఓ అర్జీదారు.. తన ఇంటి పక్కనున్న గేదెలతో వాసన వచ్చి.. ఇబ్బంది పడుతున్నానని ఏడాది కాలంగా తరచూ అధికారులకు వినతి పత్రాలు అందిస్తున్నాడు. ఈ క్రమంలో సానిటరీ సిబ్బంది పలుమార్లు గేదెల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినా.. వారు స్పందించలేదు.
దీని మీద వారు న్యాయస్థానం వరకు వెళ్లారు. ఐతే తరచూ.. ఇదే సమస్యపై స్పందనలో ఫిర్యాదు రావడంతో... చేసేదేమీ లేక శానిటరీ సూపర్వైజర్ వెంకటేశ్వరరావు రైతు శ్రీనివాస్ కు చెందిన గేదెలను తీసుకుని వచ్చి సమీపంలోని సచివాలయం వద్ద కట్టేశారు. గేదెలను తీసుకు వచ్చిన అధికారులు.. దూడను తీసుకురాకపోవడంతో అది రంకెలేస్తోంది. స్పందన అర్జీ పరిష్కరించకుంటే తనను సస్పెండ్ చేస్తారని.. అందుకే ఇలా గేదెలను తీసుకువచ్చి సచివాలయం దగ్గర కట్టేయాల్సి వచ్చిందని శానిటరీ సూపర్వైజర్ చెబుతున్నాడు. వాటి పాలన తీసుకోవాలని ప్రజలు రైతుకు సూచించామని అన్నారు. అయితే ఎన్నిసార్లు చెప్పినా అతను పట్టించుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సచివాలయానికి తరలించామని చెప్పారు.