Gyanvapi: ఏ మసీదును హిందువులకు అప్పగించం: జ్ఞానవాపి వివాదంపై అసదుద్దీన్ ఒవైసీ
అసదుద్దీన్ ఒవైసీ జ్ఞానవాపి మసీదు వివాదంపై మాట్లాడారు. ఏ మసీదును కూడా హిందువులకు అప్పగించబోమని స్పష్టం చేశారు. తవ్వకాలు జరిపితే ఎక్కడైనా ఏదో ఒకటి బయటపడుతుందని, రాష్ట్రపతి భవన్ కింద తవ్వకాలు చేపట్టినా ఏదో ఒకటి తప్పకుండా బయటపడుతుందని వివరించారు.
![muslim community can not be conceded any mosque to hindu side says asaduddin owaisi kms muslim community can not be conceded any mosque to hindu side says asaduddin owaisi kms](https://static-ai.asianetnews.com/images/01hhkyagc1hhbe7x8xgcxnzh7r/owaisi_363x203xt.jpg)
Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు వివాదంపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ మసీదును కూడా హిందువులకు అప్పగించబోమని స్పష్టం చేశారు. వారణాసిలో జ్ఞానవాపి మసీదు స్థలంలో ఏఎస్ఐ సర్వేను పేర్కొంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఒక వేళ రేపు రాష్ట్రపతి భవన్ కింద కూడా తవ్వకాలు జరిపితే ఏదో ఒక్కటి తప్పకుండా దొరుకుతుంది. మేం జ్ఞానవాపి సైట్ వద్ద కొన్ని శతాబ్దాలుగా నమాజ్ చేస్తున్నాం’ అని అన్నారు.
బాబ్రీ మసీదుతో జ్ఞానవాపి కేసుకు పోలికలు లేవని, ఈ రెండు వేర్వేరు కేసులని ఒవైసీ పేర్కొన్నారు. బాబ్రీ మసీదులో ముస్లింలు నమాజ్ చేయడం లేదని, అలాంటి సందర్భంలో సుప్రీంకోర్టు కేసులో తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు అదే స్థానంలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు.
ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసదుద్దీన్ ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ కేసు ముగిసే అవకాశమే లేదు. మేం న్యాయబద్ధంగా పోరాడుతాం. మా వద్ద ఉన్న డాక్యుమెంట్లు, టైటిళ్లను కోర్టులకు అందిస్తాం’ అని వివరించారు.
‘జ్ఞానవాపి మసీదులో మేం నమాజ్ చదువుతున్నాం. ప్రార్థనలు చేసుకుంటున్నాం. కానీ, బాబ్రీ మసీదు కేసు వేరుగా ఉండేది. బాబ్రీ మసీదు కేసు విచారణ సమయంలో ముస్లింలు అక్కడ ప్రార్థనలు చేయడం లేదు. ఈ విషయంపైనే వాదనలు జరిగాయి. కానీ, జ్ఞానవాపి మసీదులో మేం నిరంతరంగా ప్రార్థనలు చేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే 1993 నుంచి ఇక్కడ పూజలు జరగలేవు’ అని ఒవైసీ వాదించారు.
Also Read: వైఎస్ షర్మిలకు చెక్ పెట్టబోతున్నారా ? ఆ వదంతుల్లో నిజమెంతా ?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద దేశంలోని ముస్లింలు నమ్మకం కోల్పోయారని ఒవైసీ అన్నారు. ఇదే విషయాన్ని తాను పార్లమెంటులో కూడా చెప్పినట్టు తెలిపారు. ముస్లింల విషయానికి వస్తే ప్రధానమంత్రి పై వారికి ఎలాంటి నమ్మకం లేదని అన్నారు. ప్రధానమంత్రి ఆయన రాజ్యాంగ బాధ్యతలను ఒక్క ప్రత్యేకించిన భావజాలానికే నిర్వర్తిస్తున్నారని వివరించారు.