Mumbai Airport: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA)లోని రెండు రన్వేలు మే 10న ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిలిపివేయబడుతాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు చేపట్టే నిర్వహణ, మరమ్మత్తు పనుల కోసం ఈ రెండు రన్వే లను కొన్ని గంటలపాటు మూసివేయనున్నట్టు ముంబై ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు.
Mumbai Airport: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA) రన్వేలను ఈ నెల 10న మూసివేయనున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు చేపట్టే నిర్వాహణ, మరమ్మత్తు పనుల కోసం రెండు రన్వేలైన 14/32, 09/27 మూసివేయనున్నట్లు ఎయిర్పోర్ట్ ప్రతినిధి తెలిపారు. వచ్చే మంగళవారం (మే 10) ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. నిర్వాహణ పనుల అనంతరం ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.
కాగా, రన్వే మర్మమత్తు, నిర్వహణ ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. విమాన ప్రయాణికుల భద్రత కోసం రన్వేల నిర్వహణ అనేది విధిగా కొనసాగుతున్న కార్యాచరణ అని చెప్పారు. దీంతో మే 10న ముంబై విమానాశ్రయాన్ని కొన్ని గంటలపాటు మూసివేస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలతోపాటు ప్రయాణీకులకు అసౌకర్యాన్ని నివారించడానికి విమానాశ్రయానికి సంబంధించిన అన్ని వర్గాలకు ఈ మేరకు నోటీసు జారీ చేసినట్లు వెల్లడించారు.
ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (MIAL) ప్రకారం.. ముంబై విమానాశ్రయానికి రోజుకు సగటున 970 విమానాలు వస్తాయి, బయలుదేరుతాయి. వర్షాకాలం ముందు నిర్వహణ మరియు మరమ్మత్తు పనుల కోసం రన్వే మూసివేత సాధారణం. కానీ, ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు CSMIA విజ్ఞప్తి చేసింది. మే 10 న, ఎవరైనా ప్రయాణీకుడికి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఏదైనా విమానం ఉంటే, వారు ఇంటి నుండి బయలుదేరే ముందు విమాన షెడ్యూల్ను తనిఖీ చేయాలని విజ్ఞప్తి చేసింది.
