26/11 ముంబై ఉగ్రదాడి ప్రధాన సూత్రధారికి పాకిస్థాన్లో 15 ఏళ్ల జైలు శిక్ష
26/11 Mumbai terror attack: 2008 ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి సాజిద్ మీర్కు పాకిస్తాన్లోని కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, ఇదివరకే అతను చనిపోయాడని ముందుగా భావించారు. అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక ఫైనాన్స్ వాచ్డాగ్ FATF గ్రే లిస్ట్ నుండి తప్పించుకోవడానికి పాకిస్తాన్ ఈ ప్రణాళికలు చేసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
26/11 Mumbai terror attack : 26/11 ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన సాజిద్ మీర్కు ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసులో పాకిస్థాన్లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. "టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో నిషేధిత లష్కరే తోయిబా (ఎల్ఈటీ) కార్యకర్త సాజిద్ మజీద్ మీర్కు లాహోర్లోని యాంటీ టెర్రరిజం కోర్టు ఈ నెల ప్రారంభంలో 15 ఏళ్ల జైలుశిక్ష విధించింది” అని LeT మరియు జమాత్ ఉద్ దవా నాయకుల ఫైనాన్సింగ్ కేసులకు సంబంధించిన సీనియర్ న్యాయవాది చెప్పారని ఇండియా టూడే నివేదించింది. దశాబ్ద కాలంగా అమెరికా, భారత్ వాంటెడ్ లిస్టులో ఉన్న సాజిద్ మీర్ చనిపోయాడని భావించారు. కాగా, పంజాబ్ పోలీస్లోని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ (CTD), ఇలాంటి కేసుల్లో అనుమానితులకు సంబంధించిన నేరారోపణలను తరచుగా మీడియాకు తెలియజేస్తుంది. అయితే, తీవ్రవాద ఫైనాన్సింగ్ కేసులో మీర్కు శిక్ష విధించినట్లు తెలియజేయలేదు. అంతేకాకుండా, జైల్లో జరిగే ఇన్ కెమెరా ప్రొసీడింగ్ కావడంతో మీడియాను అనుమతించలేదు.
40 ఏళ్ల మధ్యలో ఉన్న దోషి సాజిద్ మీర్ ఈ ఏప్రిల్లో అరెస్టు చేసినప్పటి నుండి కోట్ లఖ్పత్ జైలులో ఉన్నారని న్యాయవాది తెలిపారు. కోర్టు దోషికి రూ.4,00,000 పైగా జరిమానా కూడా విధించిందని ఆయన చెప్పారు. 166 మందిని పొట్టనబెట్టుకున్న 26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారిగా ఉన్న సాజిద్ మీర్ అమెరికా, భారత్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. అతని సమాచారం అందించిన వారికి 5 మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించారు. మీర్ను ముంబై దాడులకు ప్రాజెక్ట్ మేనేజర్ అని పిలిచేవారు. అతను 2005లో నకిలీ పేరుతో నకిలీ పాస్పోర్ట్ను ఉపయోగించి భారతదేశానికి వచ్చినట్టు సమాచారం. అంతకుముందు, జూన్ 14-17 మధ్య బెర్లిన్లో జరిగిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) ప్లీనరీ సమావేశంలో పాకిస్తాన్ అధికారులు సాజిద్ మీర్ను ఏప్రిల్లో అరెస్టు చేశారని, విచారణ తర్వాత ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించారని పాశ్చాత్య మధ్యవర్తులకు తెలియజేసారు.
టెర్రర్ ఫైనాన్సింగ్కు దారితీసే మనీలాండరింగ్ను తనిఖీ చేయడంలో విఫలమైనందుకు పాకిస్తాన్ జూన్ 2018 నుండి FATF గ్రే లిస్ట్లో చేర్చబడింది. FATF అనేది గ్లోబల్ మనీలాండరింగ్ మరియు టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వాచ్డాగ్. ఇది చట్ట విరుద్ధ కార్యకలాపాలను నిరోధించడం మరియు సమాజానికి హాని కలిగించే లక్ష్యాలను అడ్డుకునే చర్యలతో ముందుకుసాగుతుంది. పాకిస్థాన్ గ్రే లిస్టులో ఉండటంతో ఆ దేశంపై అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ క్రమంలోనే సాజిద్ మీర్ను అరెస్టు చేయడం గ్రే లిస్ట్ నుండి బయటపడాలని పాకిస్తాన్ ప్రభుత్వం బాగా ఆలోచించిన ప్రణాళిక అని భద్రతా నిపుణులు భావిస్తున్నారు. మీర్ అరెస్టు ద్వారా పాకిస్థాన్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు చూపించాలనుకుంటోందని నిపుణులు పేర్కొంటున్నారు. FATF, ఈ సంవత్సరం జర్మనీలో జరిగిన దాని సమావేశంలో వీలైనంత త్వరగా పాకిస్తాన్లో ఆన్-సైట్ పర్యటనను నిర్వహిస్తుందని, ఆ దేశం దాని గ్రే లిస్ట్ నుండి తొలగించబడే అవకాశం ఉందని పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.