ఓ మహిళ, ఆమె ఏడేళ్ల కుమారుడు తమ బంధువుతో కలిసి వస్తుండగా, బైక్ అదుపుతప్పి.. వెనుక నుండి వేగంగా వచ్చిన ట్రక్ వారిపైకి దూసుకెళ్లడంతో ఇద్దరూ మృతి చెందారు.
ఉత్తర్ ప్రదేశ్ : ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో 30 ఏళ్ల మహిళ, ఆమె ఏడేళ్ల కొడుకు దుర్మరణం పాలయ్యారు. వారు వస్తున్న టూ వీలర్ ను ట్రక్కు ఢీకొట్టింది. దీంతో వారు ట్రక్కు కిందికి దూసుకుకెళ్లడంతో నలిగిపోయి, చనిపోయారు. జిల్లాలోని ఫారెండా ప్రాంతంలోని త్రిముహాని వంతెన సమీపంలో సోమవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది.
మృతులు ప్రియాంక చౌరాసియా, ఆమె కుమారుడు శివాంశ్ చౌరాసియాలు తమ బంధువుతో కలిసి మోటార్సైకిల్పై ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న ట్రక్ వారిపైకి దూసుకెళ్లిందని ఫారెండా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సతేంద్ర కుమార్ రాయ్ తెలిపారు.
ఈ ఘటనలో బాధితులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా, ప్రమాదంలో గాయపడిన వారి బంధువు సుమీత్ చౌరాసియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం తరువాత, ట్రక్ డ్రైవర్ ఘటనా స్థలం నుండి పారిపోయాడు అని పోలీసులు తెలిపారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహరాజ్గంజ్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
