ఆ 21 లక్షల లీటర్ల నీటికి డబ్బులు జీతంలో నుంచి కట్... ఫోన్ కోసం డ్యామ్ ను ఖాళీ చేసిన ప్రభుత్వాధికారికి షాక్...
కాంకేర్ జిల్లాలోని ఫుడ్ ఆఫీసర్ రాజేష్ విశ్వాస్, పర్కోట్ డ్యామ్ లోని 21లక్షల లీటర్ల నీటిని తన ఫోన్ కోసం తోడేశాడు. ఈ ఘటనలో ఆ నీటికి డబ్బులను అతని జీతంలో నుంచి రాబట్టాలని అంటున్నారు.
భోపాల్ : ఛత్తీస్గఢ్ లో నాలుగు రోజుల క్రితం వెలుగు చూసిన ఓ ఘటనలో అక్కడి ప్రభుత్వం ఆ అధికారికి షాక్ ఇచ్చింది. ఆ 21 లక్షల లీటర్ల నీటికి డబ్బులు అతని నుంచి వసూలు చేయాలని తెలిపింది. దానికోసం జీతంలో నుంచి ఎందుకు కోత విధించవద్దని ప్రశ్నించింది. ఛత్తీస్గఢ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఒకరు డ్యామ్ లో పడిపోయిన తన ఖరీదైన ఫోన్ను రికవరీ చేయడానికి రిజర్వాయర్ నుండి 21 లక్షల లీటర్ల నీటిని తోడేశాడు.
ఈ ఘటన వివాదాస్పదంగా మారడంతో అతడిని సస్పెండ్ చేశారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత, ఆ ఫుడ్ ఇన్స్ పెక్టర్ తనను నీటిని తోడడానికి మౌఖిక అనుమతులు ఇచ్చాడని చెప్పిన సీనియర్ అధికారిని తెరమీదికి తెచ్చింది ప్రభుత్వం.
ఈ మేరకు ఇంద్రావతి ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ అతని జీతం నుంచి వృథా చేసిన నీటి ఖర్చును ఎందుకు వసూలు చేయకూడదని సబ్ డివిజనల్ అధికారి ఆర్కే ధివర్కు ఈనెల 26న లేఖ రాశారు. వేసవిలో సాగునీరు, ఇతర అవసరాల కోసం అన్ని రిజర్వాయర్లలో నీరు అవసరమని ఆ లేఖలో సూచించారు.
కాగా, కాంకేర్ జిల్లాలోని కోయిలిబెడ బ్లాక్లోని ఫుడ్ ఆఫీసర్ రాజేష్ విశ్వాస్ ఖేర్కట్టా డ్యామ్లోని పర్కోట్ రిజర్వాయర్ వద్ద తన స్నేహితులతో కలిసి సెలవులను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సమయంలో స్నేహితులతో సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు రూ. 1 లక్ష విలువైన అతని స్మార్ట్ఫోన్ డ్యామ్ లోని నీటిలో పడిపోయింది. 15 అడుగుల లోతైన నీరు అప్పటికే అందులో ఉంది.అది వ్యర్థ జలాల స్టిల్లింగ్ బేసిన్.
విశ్వాస్ ఫోన్ పడిపోవడంతో స్థానికుల సహాయం కోరగా కొంతమంది దానికోసం డ్యామ్ లో దిగి వెతికారు. కానీ విఫలయమ్యారు. నీరు ఎక్కువగా ఉందని.. నాలుగైదు అడుగుల లోతు ఉంటే కనిపెట్టొచ్చని చెప్పారు. దీంతో అధికారి రెండు పెద్ద 30 హెచ్పి డీజిల్ పంపులను మూడు రోజుల పాటు నిరంతరాయంగా నడిపించాడు. అలా తన ఫోన్ను సంపాదించారు. దీనికోసం 1,500 ఎకరాల వ్యవసాయ భూమికి నీరందించడానికి సరిపోయే 21 లక్షల లీటర్ల నీటిని ఖాళీ చేశాడు.
ఈ ప్రాంతంలో వేసవిలో కూడా 10 అడుగుల లోతు నీరు ఉంటుంది. జంతువులు తరచుగా అక్కడికి వచ్చి నీటిని తాగుతాయి. కాలువ ద్వారా వచ్చే నీటిని స్థానిక రైతులు కూడా వినియోగిస్తున్నారు. అయితే.. విశ్వాస్ దీని గురించి చెబుతూ.. తన ఫోన్లో అధికారిక డిపార్ట్మెంటల్ డేటా ఉన్నందుకే తాను దాన్ని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించానని చెప్పాడు. ఆ నీరు "నిరుపయోగంగా" ఉందని పేర్కొన్నాడు.
"ఆదివారం సెలవు రోజు కావడంతో కొంతమంది స్నేహితులతో కలిసి ఈతకు డ్యామ్ వద్దకు వెళ్లాను. ఆ సమయంలో నా ఫోన్ ఓవర్ఫ్లో ట్యాంకర్లలోకి జారిపోయింది, అది వాడుకలో లేని నీరు. 10 అడుగుల లోతు వరకు ఉన్నాయి. స్థానికులు నా ఫోన్ కనిపెట్టడానికి ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. రెండు మూడు అడుగుల లోతులో నీరు ఉంటే తప్పకుండా దొరుకుతుందని వారు చెప్పారు. నేను ఎస్ డీఓకి ఫోన్ చేసి, అలా చేయడంలో ఇబ్బంది లేకపోతే సమీపంలోని కాలువలోకి కొంచెం నీరు తప్పించడానికి అనుమతించమని అభ్యర్థించాను.
అతను దానికి అంగీకరించాడు. మూడు-నాలుగు అడుగుల లోతు నీటిని తీసేస్తే సమస్య ఉండదని చెప్పారు. వాస్తవానికి ఎక్కువ నీరు వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అందుకే సుమారు మూడు అడుగుల నీటిని తీసివేసేందుకు స్థానికుల సహాయం పొందాను. నా ఫోన్ను తిరిగి తీసుకున్నాను" అని చెప్పాడు.
జలవనరుల శాఖ అధికారి స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ ఐదు అడుగుల వరకు నీటిని తీయడానికి తాను అంగీకరించానని, అయితే విశ్వాస్ చాలా ఎక్కువ నీటికి తోడినట్టుగా తెలిపారు.