రాహుల్ నా వైపు ఎలా పరుగెత్తుకొచ్చాడో చూశారు కదా: మోడీ
ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోకసభలో తనను కౌగలించుకోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండా ఆయన మాట్లాడారు.
లక్నో: ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోకసభలో తనను కౌగలించుకోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండా ఆయన మాట్లాడారు. ప్రధాని కుర్చీ వైపు ఆయన ఎలా పరుగెత్తుకొచ్చాడో మీరు చూశారు కదా, వారికి ప్రధాని కుర్చీ తప్ప ఏదీ కనిపించడం లేదని మోడీ అన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్ పూర్ లో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన విశ్వాస తీర్మానాన్ని ఓడించిన తర్వాత ఆయన పాల్గొన్న తొలి బహిరంగ సభ ఇదే. వారు సమాధానం చెప్పలేకపోయినప్పుడు వారు వచ్చి నన్ను కౌగలించుకున్నారని ఆయన అన్నారు.
ఎన్డీఎ ప్రభుత్వం 2014 నుంచి రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నదని అన్నారు.
తాను ఏ తప్పూ చేయకపోవడం, సరైన పంథాలో సాగడమే తాను చేసిన నేరమని ఆయన అన్నారు. కారణమేదీ లేకుండానే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారని ఆయన విమర్శించారు .