Akhilesh Yadav: కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రతిపక్షాలు బెదిరింపులకు గురిచేస్తున్నదని సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు.
SP President Akhilesh Yadav: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సర్కారుపై సమాజ్ వాదిపార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను బెదిరించాలని చూస్తోందని విమర్శించారు. ఈ క్రమంలోనే ఆశ్చర్యకరమైన రాజకీయ పరిణామాల మధ్య సమాజ్వాదీ పార్టీ (ఎస్పి) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి మద్దతుగా నిలిచారు.
అఖిలేష్ యాదవ్ గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ, సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పిలిపించడం “కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దానిపై ఒత్తిడి తెచ్చి ప్రతిపక్షాలను బెదిరించే ప్రయత్నం చేస్తోంది” అని అన్నారు. కాంగ్రెస్ నేతలకు మద్దతుగా ఎస్పీ అధ్యక్షుడు బహిరంగంగా మాట్లాడటం ఇదే తొలిసారి. కాంగ్రెస్ అగ్రనేతని ఏదో ఒకరోజు ఈడీ పిలుస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఆమెను పిలిపించడం బీజేపీ విభజించు-పాలించు విధానంలో ఇది భాగంగా ఉందని తెలిపారు. చీలికలు తీసుకురావడానికి ప్రతిపక్ష నాయకులపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని దుర్వినియోగం చేయడం కొత్త పద్ధతి కాదని, అయితే కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వం దానిని గరిష్టంగా ఉపయోగిస్తోందని ఆయన అన్నారు. బీజేపీ ప్రతిపక్ష పొత్తులను విభజించే చర్య మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో స్పష్టంగా కనిపించిందని అన్నారు. అది ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ముందుకు సాగుతున్నదని తెలిపారు. సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బిఎస్పి) చీఫ్ ఓం ప్రకాష్ రాజ్భర్పై అడిగిన ప్రశ్నకు అఖిలేష్ సమాధానమిస్తూ.. రాజ్భర్ మరో పార్టీ ఆత్మ ఆవహించినట్లు కనిపిస్తోంది. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కాలం నుంచి ఎస్పీ అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకుంది కానీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలను ఎప్పుడూ ఎదుర్కోలేదు. అయితే తొలిసారిగా ఎస్పీ కూటమిపై రాజ్భర్ ఇలాంటి ఆరోపణలు చేశారు.
తనతో విడిపోయిన మామ, ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (లోహియా) నాయకుడు శివపాల్ యాదవ్ గురించి మీడియా ప్రశ్నించగా, మామకు SP లో గౌరవం లేనందున ఆయన బయటకు వెళ్లారు. ఆయనకు సొంత పార్టీ ఉంది. సోషలిస్టు సిద్ధాంతం ప్రకారం దాన్ని మళ్లీ బలోపేతం చేసేందుకు ప్రయత్నించాలంటూ పేర్కొన్నారు. అలాగే, జీఎస్టీ రేట్ల పై కూడా ఆయన స్పందించారు. బీజేపీ సర్కారు ప్రజలపై భారం మోపుతున్నదని తెలిపారు. పాలు, దానితో తయారైన ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు దానిపై పన్ను చెల్లించిన తర్వాత శివుడికి పాలను సమర్పిస్తారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
