నీ పేరు మొహమ్మదా?.. ఆధార్ కార్డు చూపించమంటూ మూక దాడి.. బాధితుడు దుర్మరణం.. వీడియో వైరల్
మధ్యప్రదేశ్లో భన్వర్లాల్ జైన్ను మొహమ్మద్గా భావించి కొందరు దుండగులు మూక దాడి చేసి చంపేశారు. పేరు మొహమ్మద్ కదూ అంటూ బీజేపీ మాజీ కార్పొరేటర్ భర్త దాడి చేశాడు. ఆధార్ కార్డు చూపించాలంటూ పిడిగుద్దులు కురిపించాడు. ఆ వృద్ధుడు తర్వాత విగతజీవుడై కనిపించాడు.
భోపాల్: మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని పేరు చెప్పాలని పట్టుబడుతూ ఓ మూక దాడి చేసింది. ఆధార్ కార్డు చూపించాలని చితకబాదింది. ఆ వ్యక్తి మానసిక స్థిమితం లేనివాడని తెలిసింది. రాజస్తాన్లో ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరు కావడానికి మధ్యప్రదేశ్ నుంచి వెళ్లి మల్లీ ఇంటికి రాలేదు. మానసిక స్థిమితం లేని ఆ వ్యక్తి తర్వాత మిస్ అయ్యాడు. ఈ వ్యక్తిని బీజేపీ మాజీ కార్పొరేటర్ భర్త దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ నీమచ్ జిల్లాలో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్ రత్లాం జిల్లాలోని సార్సికి చెందిన 65 ఏళ్ల భన్వర్లాల్ జైన్ రాజస్తాన్లో జరిగే ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లి అదృశ్యమయ్యాడు. మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. ఆయన మానసికంగా అనారోగ్యంగా ఉన్నాడు. ఈ వ్యక్తి ఓ బెంచీపై కూర్చుని ఉండగా బీజేపీ మాజీ కార్పొరేటర్ భర్త దినేశ్ కుష్వాహా ఆయనపై దాడి చేయడం ప్రారంభించినట్టు వీడియో చూపిస్తున్నది.
నీ పేరు మహమ్మద్ కదూ.. అంటూ మళ్లీ మళ్లీ అడుగుతూ ఆ వృద్ధుడిపై దాడి చేశాడు. ఆ వృద్ధుడు సమాధానం చెప్పడానికి ఆపసోపాలు పడ్డాడు. కానీ, సమాధానం ఇవ్వలేకపోయాడు. దీంతో నీ పేరు సరిగా చెప్పు. నీ ఆధార్ కార్డు తియ్ అంటూ బెదిరించాడు. ఆధార్ కార్డు తీయమని చెబుతూ మళ్లీ వరుసగా ఆ వృద్ధుడిపై దాడి చేశాడు. ఈ వీడియో వైరల్ అయింది. అయితే, ఈ వీడియోలో దాడికి గురైన భన్వర్లాల్ జైన్ తర్వాత విగతజీవుడై కనిపించాడు.
నీమచ్ జిల్లా మానస పోలీసు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ కన్హయ్య లాల్ దంగి మాట్లాడుతూ, మానసిక వైకల్యం గల భన్వర్లాల్ ఓ వర్గానికి చెందిన వ్యక్తిగా భావించి నీమచ్లో దాడి చేసి చంపారని తెలిపారు. ఈ వీడియోలో దినేశ్ కుష్వాహా.. భన్వర్లాల్ జైన్ను దాడి చేస్తున్నట్టు కనిపిస్తున్నదని, ఆ తర్వాత వృద్ధుడు మరణించినట్టు చెప్పారు.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యాక భన్వర్లాల్ జైన్ కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై కేసు నమోదైంది. దినేశ్ కుష్వాహాను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.