కోల్కతాలో మైనర్ బాలిక కిడ్నాప్, హత్య.. మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కిన పక్కింటి వ్యక్తి...
కోల్కతాలో ఆదివారం ఓ మైనర్ బాలికను 32 ఏళ్ల వ్యక్తి కిడ్నాప్ చేసి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ కిడ్నాప్, హత్యల వెనుక అసలు కారణం ఇంకా తెలియలేదు.
కోల్కతా : కోల్కతాలో ఆదివారం నాడు యేడేళ్ల బాలికను ఆమె పక్కింటివ్యక్తి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహం పొరుగు ఫ్లాట్లోని గోనె సంచిలో కుక్కి కనిపించింది. ఇది వెలుగులోకి రావడంతో 32 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్కతాలోని శ్రీధర్ రాయ్ రోడ్లో నివసిస్తున్న మైనర్ బాలిక ఆదివారం తెల్లవారుజామున కనిపించకుండా పోయింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాధితురాలి కుటుంబ సభ్యులు తిలజాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలిక కనిపించకుండా పోవడంతో వారు..ఇంట్లో, బయట, చుట్టుపక్కల వెతికారు. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంట్లో, బయట వెతకడమే కాకుండా.. బాలిక నివసించే భవనంలోని మొత్తం 32 ఫ్లాట్లలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. కానీ బాలిక ఆచూకీ లభించలేదు.
‘అనిత.. పుచ్కావాలీ’... ఆస్పత్రి మూసేసి పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్.. కారణం ఏంటంటే..
ఇదిలా ఉండగా, మైనర్ బాలిక పక్కనే ఉన్న భవనంలోకి ప్రవేశించడం సిసిటివిలో కనిపించిందని స్థానికులు తెలిపారు. అయితే.. ఈ ఫుటేజీని పోలీసులకు చూపించినప్పటికీ, వారు క్షుణ్ణంగా వెతికినా ఆమె జాడ కనిపెట్టలేకపోయారు. దీంతో పోలీసుల పనితీరుపై ఇరుగుపొరుగు వారిలో ఆందోళన నెలకొంది. చాలాసేపు వెతికిన తర్వాత.. సాయంత్రానికి వారింటి పక్కనే తాళం వేసి ఉన్న ఇంటిని గమనించిన ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. వారు తాళం పగులగొట్టి చూడగా గోనె సంచిలో తప్పిపోయిన బాలిక మృతదేహాన్ని గుర్తించారు.
అలోక్కుమార్ ఫ్లాట్లోని రెండో అంతస్తులో మృతదేహం లభ్యమైనట్లు కోల్కతా పోలీసులు ధృవీకరించారు. బీహార్లోని సమస్తిపూర్కు చెందిన అలోక్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో హత్య చేసినట్లు అంగీకరించారు. 7 ఏళ్ల బాలిక హత్య వెనుక ఉద్దేశ్యం ఇంకా తెలియలేదు. అరెస్టు చేసిన నిందితుడిని ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. బాలిక తల, చెవిపై గాయాలున్నట్లు గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తారు.
ఈ సంఘటన తరువాత, ఆ ప్రాంతంలో గందరగోళం చెలరేగింది. పోలీసుల నిర్లక్ష్యమే బాలిక మరణానికి కారణమని ఆరోపిస్తూ ఇరుగుపొరుగు వారు టిల్జాల పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టి నిరసన తెలిపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించి, జనం ఆందోళనకు దిగడంతో పోలీస్ స్టేషన్ గేటును కూడా మూసివేశారు. ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక అందుబాటులోకి వచ్చిన తర్వాత మరింత సమాచారం అందిస్తామని కోల్కతా పోలీసు సీనియర్ అధికారి ప్రజలకు హామీ ఇచ్చారు.