బదిలీల గొడవలు.. మంత్రిని కొట్టిన మరో మంత్రి
బదిలీల గొడవలు.. మంత్రిని కొట్టిన మరో మంత్రి
మంత్రివర్గంలో మంత్రుల మధ్య ఎంతటి సఖ్యత ఉండాలి.. అలాంటిది ఒక మంత్రి మరో మంత్రిపై చేయి చేసుకుంటే.. రాజస్థాన్లో అచ్చం అలాంటి సంఘటనే జరిగింది. శిఖర్ జిల్లా ఖండేలా నియోజకవర్గంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరగడం లేదనే ఆరోపణలు వచ్చాయి. దీంతో విషయం కనుక్కుందామని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి బన్షీధర్ బజియా.. విద్యాశాఖ మంత్రి వసుదేవ్ దేవ్నానీతో చర్చించచేందుకు ఆయన ఇంటికి వెళ్లారు..
ఈ క్రమంలో ఇద్దరి మధ్యా మాట మాట పెరిగింది. సహనం కోల్పోయిన బజియా మరో మంత్రి దేవ్నానీపై చేయిచేసుకున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై స్పందించేందుకు దేవ్నానీ నిరాకరించగా.. మరో మంత్రి బజియా తన మొబైల్ను స్విచ్ఛాఫ్ చేశారు. కాగా, ఇద్దరు మంత్రుల మధ్య గొడవ జరిగిన విషయం మాత్రం వాస్తవమేనని బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి.
అటు బీజేపీ హైకమాండ్ కూడా సీరియస్ అవ్వడంతో రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఇద్దరిని పిలిచి మాట్లాడినట్లు తెలుస్తుంది. ఈ సంఘటనను అస్త్రంగా చేసుకుని వసుంధరా రాజే ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.