అర్థరాత్రి కారులో మృతదేహంతో పోలీస్ స్టేషన్ కు.. షాక్ లో పోలీసులు..
ఆర్థిక పరమైన లావాదేవీల కారణంగా ఓ వ్యక్తిని హత్య చేసి, కారులో మృతదేహంతో అర్థరాత్రి పోలీస్ స్టేషన్ కు వచ్చాడు ఓ వ్యక్తి.
బెంగళూరు : రామమూర్తినగర్ పోలీస్ స్టేషన్లో నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులకు తెల్లవారుజామునే షాక్ లాంటి ఘటన ఎదురయ్యింది. మంగళవారం తెల్లవారుజామున వచ్చిన ఓ వ్యక్తి ఆర్థిక వివాదాల కారణంగా తాను ఒక వ్యక్తిని హత్య చేసినట్లు చెప్పాడు. అంతేకాదు అతడి మృతదేహాన్ని తన కారులో తీసుకువచ్చానని చెప్పడంతో వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
నిందితుడు జయంతి నగర్లో నివాసముంటున్న కార్ మెకానిక్ రాజశేఖర్. మృతుడు మైసూరు జిల్లా నంజనగూడు తాలూకాలోని హిమ్మనహుండి నివాసి మహేశప్ప (45)గా పోలీసులు గుర్తించారు.
ఆ సమయంలో అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ బుద్దెగౌడ డ్యూటీలో ఉన్నాడు. అర్ధరాత్రి 1 గంటకు స్టేషన్కి వచ్చిన రాజశేఖర్ హత్య గురించి తాపీగా చెప్పాడు. విషయం వినగానే షాక్ అయిన గౌడ, ఇతర నైట్ డ్యూటీ సిబ్బంది వెంటనే బయటకు కారు దగ్గరికి పరుగెత్తారు.
రాజశేఖర్ హ్యుందాయ్ ఎక్సెంట్ కారు వెనుక సీటులో మహేశప్ప మృతదేహం పడి ఉంది. షాక్కు గురైన ఏఎస్ఐ వెంటనే రాత్రి గస్తీలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ అరవింద్ కుమార్ ఆర్కి ఫోన్ చేసి స్టేషన్కు పిలిపించారు. కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి రాజశేఖర్ను అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజశేఖర్ నగర శివార్లలోని ఆవలహళ్లి సమీపంలో మహేశప్పను కొట్టి చంపి, మృతదేహాన్ని తన కారు వెనుక సీటుపై పడేశాడు. రామమూర్తినగర్ పోలీస్ స్టేషన్కు చేరుకుని వాహనం బయట పార్క్ చేశాడు. మహేశప్పపై ఇనుప రాడ్తో దాడి చేసి, కొట్టినట్లు రాజశేఖర్ పోలీసులకు తెలిపాడు. ఆ తరువాత కారు వెనుక సీటులో అతడిని చేర్చాడు.అప్పటికి అతను మరణించలేదు. అలాగే కారును డ్రైవ్ చేసుకుంటూ వెడుతున్న సమయంలో రాత్రి 10 గంటల సమయంలో అవలహళ్లిలోని ఓ రెస్టారెంట్ దగ్గర కారును ఆపాడు.
సీఈసీగా ఉత్తమైన వ్యక్తి ఉండాలి.. టీఎన్ శేషన్ లాంటి వ్యక్తి అవసరం: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..
అక్కడ తనకు, మహేషప్ప కోసం ఫుడ్ తీసుకుని వచ్చాడు. ఆ తరువాత మహేశప్పను లేపగా అతను మృతి చెందినట్లు గుర్తించాడు. ఆ తరువాత తనకేం చేయాలో అర్థం కాలేదు. చంపాలనే ఉద్దేశ్యంతో కొట్టలేదు. చనిపోయాడు కాబట్టి... దాదాపు మూడు గంటల పాటు మృతదేహంతో కారులో తిరిగాడు. ఆ తరువాత పోలీసులకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు తెలిపారు.
తల్లిని మోసం చేశాడని...
ప్రాథమిక విచారణ ప్రకారం, మహేశప్ప కొన్నేళ్ల క్రితం బెంగళూరులో ఉండేవాడు. ఆ తరువాత తన స్వగ్రామానికి తిరిగి వెళ్లాడు. అలా రాజశేఖర్ తల్లి సువితకు 13 ఏళ్ల క్రితం మహేశప్పతో కామన్ ఫ్రెండ్ అయిన మరో మహిళ ద్వారా పరిచయం ఏర్పడింది. మహేశప్ప తనను తాను మహిళా సంఘ అనే ఎన్జీవో వ్యవస్థాపకుడిగా పరిచయం చేసుకున్నాడు. ఈ సంఘం ద్వారా తాను మహిళలకు రుణాలు, నిధులు ఇప్పిస్తానని ఆమెకు హామీ ఇచ్చాడు. అది నమ్మిన సువిత తన స్నేహితులకు మహేశప్పను పరిచయం చేసింది. వారందరూ కలిసి మహేశ్ప్పకు రూ. 2 కోట్లకు పైగా ఇచ్చారు. అతని సంఘ నుండి తమకు రుణాలు, నిధులు వస్తాయని ఆశించారు. అయితే మహేశప్ప వారిని మోసం చేసి డబ్బులు తిరిగి ఇవ్వలేదు.
దీంతో వారంతా సువిత మీద ఒత్తిడి తెచ్చారు. సువిత తన ఇంటిని అమ్మి తన ద్వారా మహేశప్పకు డబ్బులు ఇప్పించిన కొంతమంది మహిళలకు తిరిగి చెల్లించింది. మహేశప్పనుంచి డబ్బులు వసూలు చేయడానికి అతడిని బెంగళూరుకు తీసుకురావాలని రాజశేఖర్ నిర్ణయించుకున్నాడు. అందుకే మహేశప్ప గ్రామానికి వెళ్లాడు. మహేశప్ప నగరానికి వచ్చి తన తల్లి దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశాడు. కానీ దీనికి అతను ససేమిరా అనడంతో చేసేదిలేక రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అతడిపై దాడి చేశాడు. రామమూర్తినగర్ పోలీసులు అధికారులు ఇది తమ పరిధిలోకి వస్తుందో రాదో చూసి కేసును ఆవలహళ్లి పోలీసులకు బదిలీ చేస్తామని తెలిపారు.