అగ్గిపెట్టె ధర రెట్టింపు.. 14ఏళ్ల తర్వాత పెరుగుదల.. ఎప్పటి నుంచి అమలంటే..?
అగ్గిపెట్టె ధర రెట్టింపుకానుంది. ఇప్పటి వరకు ఒక్క రూపాయికే అందుబాటులో ఉన్న మ్యాచ్ బాక్స్ ఇకపై రూ. 2కే లభించనుంది. ముడిసరుకుల ధరలు పెరగడం, ఇంధన ధరల పెరుగుదలతోనూ రవాణా భారంగా మారిందని, ఈ కారణాల మూలంగానే అగ్గిపెట్టె ధర పెంచడం అనివార్యంగా మారిందని తయారీ సంస్థల సమాఖ్య పేర్కొంది.
న్యూఢిల్లీ: నేడు అన్ని సరుకుల ధరలు మండిపోతున్నాయి. చమురు ధరల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పని లేదు. ఎన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా అగ్గిపెట్టె ధర మాత్రం స్థిరంగా రూపాయికే పరిమితమై ఉంది. దశాబ్దానికి మించి అగ్గిపెట్టె ధరలో మార్పు రాలేదు. ఏ ఊరికి వెళ్లినా, ఎక్కడికివెళ్లినా రూపాయికే అగ్గిపెట్టే లభించేది. కానీ, 14 ఏళ్ల తర్వాత తొలిసారిగా అగ్గిపెట్టె ధర రెట్టింపు కానుంది. ఫైర్ క్రాకర్స్ ఫేమస్ అయిన తమిళనాడులోని శివకాశీలో తాజాగా Match Box తయారీదార్ల ఐదు కీలక సంఘాలు సమావేశమయ్యాయి. ఇందులో Prices పెంపుపై నిర్ణయం తీసుకున్నారు.
2007లో అగ్గిపెట్టె ధర 50 పైసలు ఉండేది. అప్పుడే ధరను రెట్టింపు చేశారు. అదికాస్త one rupeeగా మారింది. కాని అప్పటి నుంచి ఇప్పటి వరకు అగ్గిపెట్టె ధరలో మార్పులేదు. తాజాగా దీని ధర రెండు రూపాయలకు పెరుగనుంది. ఇప్పుడు 600 అగ్గిపెట్టెల బాక్సును రూ. 270 నుంచి రూ. 300కు తయారీదార్లు విక్రయిస్తున్నారు. ఇకపై ఈ బాక్సును రూ. 430 నుంచి రూ. 480కి పెంచనున్నారు. ఇందుకు అదనంగా 12శాతం జీఎస్టీ, రవాణా చార్జీలు ఉంటాయని నేషనల్ స్మాల్ మ్యాచ్బాక్స్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ వివరించింది.
Also Read: ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన బాట.. 15 రోజుల పాటు భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు..
ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి అగ్గి పెట్టె ధరను రూ. 2కు పెంచి విక్రయిస్తామని ఆలిండియా చాంబర్ ఆఫ్ మ్యాచెస్ సమాఖ్య ప్రకటించింది. అగ్గిపెట్టె తయారీకి అవసరమైన ముడి సరుకుల ధర పెరగడం మూలంగానే అగ్గిపెట్టె ధర పెంచాల్సి వస్తున్నదని వివరించింది. ముఖ్యంగా అగ్గిపుల్ల తయారీకి ఉపయోగించే ఎర్ర బాస్వరం ధర రూ. 425 నుంచి రూ. 810కి పెరిగింది. మైనం ధర రూ. 58 నుంచి రూ. 80కి పెరిగిందని వివరించింది. వీటితోపాటు అగ్గిపెట్టెల బాక్స్ బోర్డులు, పేపర్ ఇతర ముడి పదార్థాల ధరలు పెరిగాయని తెలిపింది. వీటికితోడు చమురు ధరల పెరుగుదలతో రవాణా కూడా భారంగా మారిందని వివరించింది. ఈ కారణాలతో అగ్గిపెట్టె ధర పెంచడం అనివార్యంగా మారిందని పేర్కొంది.