అపార్ట్ మెంట్లోకి చొరబడ్డ ముసుగు వ్యక్తులు.. ఫ్లాట్ డోర్ మీద కాల్పులు జరిపి పరార్...
ముసుగు ధరించిన వ్యక్తులు తప్పించుకునే ముందు గ్రౌండ్ ఫ్లోర్లోని మరో అపార్ట్మెంట్ కిటికీపై కూడా మూడుసార్లు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.
![Masked persons. fired on the flat door and escaped in delhi - bsb Masked persons. fired on the flat door and escaped in delhi - bsb](https://static-ai.asianetnews.com/images/01gbvv0gpnatr63v9ck4qz8gne/new-project--2-_363x203xt.jpg)
న్యూఢిల్లీ : ఆగ్నేయ ఢిల్లీలోని సిద్ధార్థ్ నగర్లోని ఓ అపార్ట్మెంట్ లోని ప్లాట్ మూసిఉన్న తలుపు మీద ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఆదివారం కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన సన్లైట్ కాలనీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హిప్నోథెరపిస్ట్ సోహైల్ సిద్ధిఖీకి చెందిన మొదటి అంతస్తులోని అపార్ట్మెంట్ తలుపుపై నిందితులు రెండుసార్లు కాల్పులు జరిపారు. దాడి చేసినవారు గ్రౌండ్ ఫ్లోర్ వైపు పారిపోయారు.
నిందితులు మొదటి అంతస్తులోని అపార్ట్మెంట్ లోకి వచ్చారు. తలుపులు పెట్టి ఉండడంతో.. తాళం తీయడానికి ప్రయత్నించారు. తలుపులుతీయడానికి కుదరకపోవడంతో ఏం చేయాలో తెలియక.. నాలుగు మెట్లు కిందికి దిగి.. రెండుసార్లు కాల్పులు జరిపారు. ఆ తరువాత ఆపై వారు గ్రౌండ్ ఫ్లోర్ వైపు పారిపోయారు. అతనితోపాటు ఉన్న మరో వ్యక్తి మూడు రౌండ్లు కాల్చారు.
ముసుగులు ధరించిన వ్యక్తులు తప్పించుకునే ముందు గ్రౌండ్ ఫ్లోర్లోని మరో అపార్ట్మెంట్ కిటికీపై మూడుసార్లు కాల్పులు జరిపారని పోలీసులు మరింత సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో నిక్షిప్తమైందని అధికారులు తెలిపారు.
"సిసిటివి ఫుటేజీలో ఇద్దరు యువకులు అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించారు. మొదటి అంతస్తు వరకు వెళ్లి, ఓ ప్లాట్ తలుపు తట్టారు. ఆ తరువాత ఎంట్రెన్స్ లో కాల్పులు జరపడం కనిపిస్తుంది" అని ఒక అధికారి తెలిపారు.
"తరువాత వారు గ్రౌండ్ ఫ్లోర్ వైపు పరిగెత్తారు. మరొక ఫ్లాట్ కిటికీ దగ్గర 3 రౌండ్లు కాల్పులు జరిపారు," అని అధికారి చెప్పారు. ఆ తరువాత, నిందితులు అక్కడి నుండి పారిపోయారు. టార్గెట్ చేసిన అపార్ట్మెంట్ ప్రస్తుతం అద్దెకు ఉందని, ఈ విషయంలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.