ఒడిశాలోని ఓ పెళ్లి వేడుకలో మటన్ తక్కువైందని పెళ్లే రద్దయిన ఘటన చోటుచేసుకుంది. పెళ్లి కొడుకు కుటుంబానికి మటన్ సరిపోకపోవడంతో తమకు మటన్ తేకుంటే పెళ్లి రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. వారు తెచ్చి పెట్టిన విషయం పెళ్లి కూతురికి తెలియడంతో అలాంటి కుటుంబంలోని అబ్బాయిని పెళ్లి చేసుకోబోనని స్పష్టం చేసింది.
Marriage: పెళ్లి విందులో దాదాపు నాన్ వెజ్ పెడుతారు. అందులో మటన్కు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో చెప్పడానికి విందుకు తెచ్చిన మేకల సంఖ్యను చెబుతారు. కానీ, ఆ మటన్ కారణంగానే పెళ్లి ఆగిపోవడం అరుదు. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
కొన్ని వర్గాల ప్రకారం, సంబల్పూర్కు చెందిన యువతి సుందర్గడ్కు చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంటున్నది. ఈ పెళ్లి విందులో అన్ని రకాల వంటకాలు చేసి అందుబాటులో ఉంచారు. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కూడా చేసి రెడీగా పెట్టారు.
పెళ్లి కొడుకు కుటుంబం పెళ్లి వేదిక వద్దకు వెళ్లారు. అక్కడికి చేరిన తర్వాత వారంతా భోజనం చేశారు. అయితే, ఓ ఐదారుగు మందికి మాత్రం మటన్ దొరకలేదు. దీంతో వారికి కూడా మటన్ తేవాలని వారు పెళ్లి కూతురు వైపు వారిని డిమాండ్ చేశారు. తమకు మటన్ సర్వ్ చేయాలని లేదంటే పెళ్లినే రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
Also Read: భార్యను పంపించట్లేదని భర్త మనస్తాపం.. అత్తవారింట్లోనే ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?
పెళ్లి కూతురు వైపు కుటుంబ సభ్యులు వెంటనే అదే రాత్రి సమీప రెస్టారెంట్ నుంచి మటన్ తెచ్చారు. వారికి అందించారు.
ఈ విషయం పెళ్లి కూతురికి తెలిసింది. ఆమె వెంటనే పెళ్లిని రద్దు చేసింది. కేవలం మటన్ లేదనే కారణంతో తన తల్లిదండ్రులను అవమానపరిస్తే.. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని తనకూ ఇష్టం లేదని స్పష్టం చేసింది. దీంతో వరుడి కుటుంబం ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. జరిగిన దానికి క్షమాపణలు చెప్పారు. అయినా.. ఆమె కరగలేదు. దీంతో పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురు లేకుండానే వారి ఇంటికి వెళ్లిపోయాడు.
