ఢిల్లీలో సూపర్ ప్లాన్.. తగ్గిన కరోనా కేసులు
ఈశాన్య ఢిల్లీ తరువాత రాజధానిలో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం ఇది. ఇక్కడ చదరపు కిలోమీటరుకు 27,730 మంది ఉంటున్నారు.
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ లో మాత్రం రోజు రోజుకీ కరోనా కేసులు తగ్గముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు అత్యధిక కరోనా కేసులతో తల్లడిల్లిన ఢిల్లీ.. ఇప్పుడు కాస్త ఊపిరిపీల్చుకుంటుంది. అత్యధిక కరోనా ప్రభావిత 20 జిల్లాలలో సెంట్రల్ ఢిల్లీ కూడా ఉంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జూన్లో ఇక్కడ ప్రతిరోజూ 350కు పైగా కరోనా కేసులు నమోదయ్యేవి. అయితే జూలైలో ఇది 100 కు చేరుకుంది.
సెంట్రల్ ఢిల్లీ విషయానికొస్తే దీనిని మూడు ఉపవిభాగాలుగా విభజించారు. ఇందులో సివిల్ లైన్స్, కరోల్బాగ్, కొత్వాలి, బురారి తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఎర్రకోట, జామా మసీదు ప్రాంతాలు ఎంతో రద్దీగా ఉంటాయి. ఈశాన్య ఢిల్లీ తరువాత రాజధానిలో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం ఇది. ఇక్కడ చదరపు కిలోమీటరుకు 27,730 మంది ఉంటున్నారు.
ఈ ప్రాంతంలో కరోనా కేసుల గురించి సర్వే నిర్వహించినపుడు జిల్లాలో 28 శాతం మందికి వ్యాధి సోకినట్లు వెల్లడయ్యింది. అయితే వైద్యాధికారులు వెంటనే అప్రమత్తమై, పరిస్థితిని సకాలంలో నియంత్రించారు. జిల్లాలో 5.8 లక్షల జనాభా ఉంది. వారిలో 10,761 కరోనా బాధితులు ఉన్నారు. వీరిలో 6,721 మంది పురుషులు, 4,040 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ కరోనా నియంత్రణకు అధికారులు ప్రతిప్రాంతానికి అనుగుణంగా భిన్నమైన వ్యూహాన్ని రూపొందించి, కరోనాను అదుపులోకి తీసుకువచ్చారు.
దీనిపై సెంట్రల్ ఢిల్లీ డిఎం నిధి శ్రీవాస్తవ మాట్లాడుతూ దేశంలో అత్యధికంగా కరోనాకు ప్రభావితమైన 20 జిల్లాల్లో సెంట్రల్ ఢిల్లీ ఒకటని, తొలుత ఈ ప్రాంత భౌగోళిక స్వరూపాన్ని, ప్రజల తీరుతెన్నులను అర్థం చేసుకుని కరోనా కట్టడికి ప్రణాళికలు వేశామన్నారు. కరోనా సోకిన వారిని వెంటనే క్వారంటైన్కు తరలించడంలాంటి జాగ్రత్తలు తీసుకోవడంతో క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చిందని తెలిపారు.