ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్య... రక్తపు మడుగులో వ్యక్తి, కాపాడిన పోలీసులు
సోషల్ మీడియా ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన ఘటన దేశ రాజధాని న్యూడిల్లీలో చోటుచేసుకుంది.
న్యూడిల్లీ: సోషల్ మీడియా కారణంగా చాలా ప్రాణాలు పోవడమే మనం ఇప్పటివరకు చూశాం. కానీ ఇదే సోషల్ మీడియా ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన ఘటన దేశ రాజధాని న్యూడిల్లీలో చోటుచేసుకుంది. ఓ 39ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ దాన్ని ఫేస్ బుక్ లో లైవ్ పెట్టగా అప్రమత్తమైన పోలీసులు అతడిని కాపాడారు.
వివరాల్లోకి వెళితే... ఐదేళ్ల క్రితం భార్య చనిపోవడంతో ఓ వ్యక్తి ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం వుంటున్నాడు. స్వీట్ షాప్ లో పనిచేస్తూ పిల్లలను పోషించుకుంటున్నాడు. అయితే భార్య మరణం తర్వాత అతడు కాస్త డిస్టర్బ్ అయి ప్రతి చిన్న విషయానికి ఆందోళనకు గురయ్యేవాడు.
అయితే రెండు రోజుల క్రితం అతడితో ఇంటిపక్కన నివాసమముండే ఓ కుటుంబం గొడవపడింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన అతడు అదే రాత్రి చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఆత్మహత్యను ఫేస్ బుక్ లైవ్ పెట్టాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
వెంటనే అతడి లోకేషన్ ను గుర్తించిన డిల్లీ పోలీస్ కమాండ్ రూం సిబ్బంది దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. వెంటనే అతడి ఇంటికి చేరుకున్న పోలీసులు రక్తపుమడుగులో పడివున్న అతడిని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని పోలీసులు తెలిపారు.