మోడీ- కేజ్రీవాల్ల మధ్య సింగపూర్ చిచ్చు... కేంద్రానికి ఆప్ కౌంటర్
కేంద్రం- ఢిల్లీ సర్కార్ మధ్య మళ్లీ వివాదం ముదురుతోంది. సింగపూర్ స్ట్రెయిన్ చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న కేజ్రీవాల్ కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. సింగపూర్ అభ్యంతరం వ్యక్తం చేయడం.. విదేశాంగ శాఖ కేజ్రీవాల్ వ్యాఖ్యలు పట్టించుకోవద్దని క్లారిటీ ఇవ్వాల్సి రావడంతో ఈ వ్యవహారం ఇంకా ముదురుతోంది
కేంద్రం- ఢిల్లీ సర్కార్ మధ్య మళ్లీ వివాదం ముదురుతోంది. సింగపూర్ స్ట్రెయిన్ చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న కేజ్రీవాల్ కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. సింగపూర్ అభ్యంతరం వ్యక్తం చేయడం.. విదేశాంగ శాఖ కేజ్రీవాల్ వ్యాఖ్యలు పట్టించుకోవద్దని క్లారిటీ ఇవ్వాల్సి రావడంతో ఈ వ్యవహారం ఇంకా ముదురుతోంది.
సింగపూర్ వేరియెంట్ అంటూ అరవింద్ కేజ్రీవాల్ చేసిన కామెంట్లు అంతర్జాతీయంగా హీట్ పుట్టిస్తున్నాయి. సింగపూర్లో వచ్చిన కోవిడ్ వేరియెంట్ కారణంగా చిన్నపిల్లలకు ఎక్కువగా వైరస్ సోకుతుందన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలపై అక్కడి ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
సింగపూర్లోని భారత హైకమీషనర్కు నోటీసులు ఇచ్చి అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రంగంలోకి దిగారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలను పట్టించుకోవద్దంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ మాటల యుద్ధం ఇంతటితో ఆగలేదు.
Also Read:మిత్ర దేశాలతో శత్రుత్వం తీసుకురావొద్దు, కేజ్రీవాల్ కి ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ చురకలు
కేజ్రీవాల్ తీరును జైశంకర్ తప్పుబట్టారు. సింగపూర్తో భారత్కు వున్న సంబంధాలను దెబ్బతీసే విధంగా కేజ్రీవాల్ మాట్లాడారంటూ మండిపడ్డారు. రెండు దేశాల మధ్య బలమైన మిత్రత్వం వుందని.. కరోనా పోరులో ఇరు దేశాలు సహకరించుకుంటున్నాయని జైశంకర్ గుర్తుచేశారు.
అయితే జైశంకర్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చింది ఆప్. కేంద్రానికి దేశ ప్రజల కంటే మోడీ ఇమేజే ముఖ్యమని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మండిపడ్డారు. అంతర్జాతీయంగా తమ ప్రతిష్టను కాపాడుకునేందుకు దేశ ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
కేజ్రీవాల్కు చిన్న పిల్లలపై ధ్యాస వుంటే కేంద్రానికి సింగపూర్పై ధ్యాస అంటూ మనీశ్ సెటైర్లు వేశారు. మరోవైపు కేజ్రీవాల్ కామెంట్లపై సింగపూర్ కూడా మండిపడింది. ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్.. కేజ్రీవాల్పై మండిపడ్డారు. రాజకీయ నాయకులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. సింగపూర్ వేరియెంట్ అంటూ ఏ వైరస్ లేదని బాలకృష్ణన్ స్పష్టం చేశారు.