Manipur Violence: మణిపూర్ హింసపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్టేటస్ రిపోర్టును సమర్పించిందనీ, పరిస్థితి మెరుగుపడుతోందని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. మణిపూర్‌లో మే 3న జాతి వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. మరుసటి రోజే తొలిసారిగా రాష్ట్రంలో ఇంటర్నెట్‌ను నిషేధించారు. గత రెండు నెలలుగా మణిపూర్‌లో జరిగిన హింసాకాండలో మొత్తం 142 మంది మరణించారని ఎన్ బీరెన్ సింగ్ ప్రభుత్వం సోమ‌వారం సుప్రీంకోర్టుకు తెలిపింది. 

Manipur violence Status Report: గత రెండు నెలలుగా మణిపూర్ లో జరిగిన హింసాకాండలో మొత్తం 142 మంది మరణించారని ఎన్ బీరెన్ సింగ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. హింసాత్మ‌క‌ పరిస్థితిని అదుపులో ఉంచడానికి 5,995 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామనీ, 6,745 మందిని అదుపులోకి తీసుకున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనానికి సమర్పించిన తాజా స్టేటస్ రిపోర్టులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వినీత్ జోషి తెలిపారు. తదుపరి విచారణ కోసం ఆరు కేసులను సీబీఐకి బదిలీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మే నెల నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 5,000 ఘటనలు, అగ్నిప్రమాదాలు జరిగాయని, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్ జిల్లాల్లో అత్యధిక మరణాలు సంభవించాయని నివేదిక తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించింది. భద్రతా మోహరింపును ప్రతిరోజూ సమీక్షిస్తున్నామనీ, ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎస్ఓపీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. శాంతిని కాపాడేందుకు 124 పారామిలటరీ బలగాలు, 184 ఆర్మీ కాలమ్స్ రంగంలోకి దిగాయని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పునరావాస శిబిరాల్లో ఉన్న విద్యార్థులను సమీప పాఠశాలలతో అనుసంధానించే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి తీసుకున్న చర్యలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో పలు పోటీ పరీక్షలు నిర్వహించినట్లు కూడా తెలిపింది.

కేసుల వారీగా ఇంటర్నెట్ నిషేధాన్ని షరతులతో సడలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో రెండు నెలలుగా ఇంటర్నెట్ సేవ‌ల‌ను నిలిపివేశారు. స్థానిక పరిస్థితులను అంచనా వేసిన తర్వాత కర్ఫ్యూ సడలింపు సమయాలను పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పిటిషనర్లు తమ వాదనల సమయంలో గిరిజనుల పేర్లను ప్రస్తావించవద్దని రాష్ట్ర ప్రభుత్వం కోరింది, ఇది క్షేత్రస్థాయిలో పరిస్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నొక్కి చెప్పింది. హింసను అరికట్టడానికి, బాధితుల పునరావాసం కోసం తీసుకున్న చర్యలపై నవీకరించిన నివేదికను సమర్పించాలని కోర్టు గత వారం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.