Manipur Assembly Election 2022: మణిపూర్లో 2022 అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 92 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 11 గంటలకు వరకు 28.19 శాతం పోలింగ్ నమోదైంది. అయితే, పేలుడు ఘటన కలకలం రేపింది.
Manipur Assembly Election 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే పలు దశల ఎన్నికలు పూర్తయిన క్రమంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుండటంతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఇక మణిపూర్ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అధికారం దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఇప్పటివరకు ఎత్తుకుపై ఎత్తులు వేస్తూ.. ముమ్మర ప్రణాళికలతో ప్రచారం సాగిస్తూ.. ఓటర్లను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలోనే శనివారం నాడు రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
వివరాల్లోకెళ్తే.. మణిపూర్లో 2022 అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 92 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 9 గంటల వరకు 11.40% ఓటింగ్ నమోదైంది. ఇక ఉదయం 11 గంటలకు వరకు 28.19 శాతం పోలింగ్ నమోదైంది. అయితే, ఎన్నికల వేళ స్థానికంగా పేలుడు సంభవించడం కలకలం రేపింది. మణిపూర్లోని కొన్ని చోట్ల అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ శనివారం ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు హింస చెలరేగింది. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని లాంఫెల్ ప్రాంతంలో బీజేపీ బహిష్కరణకు గురైన బిజోయ్ నివాసం వద్ద గుర్తుతెలియని దుండగులు ముడి బాంబును పేల్చినట్లు పోలీసులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ముఖానికి ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ఈ పేలుడుకు పాల్పడినట్టు వెల్లడించారు. దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.
మొదటి దశలో ఫిబ్రవరి 28న పోలింగ్ జరిగిన ఐదు నియోజకవర్గాల్లోని 12 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ కూడా జరుగుతోంది. ఎటువంటి విరామం లేకుండా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 4,28,679 మంది మహిళలు, 31 మంది ట్రాన్స్జెండర్లతో సహా మొత్తం 8,38,730 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఆరు ఎలక్టోరల్ జిల్లాల్లోని 1,247 పోలింగ్ స్టేషన్లలో వినియోగించుకోనున్నారు. ఆ ప్రాంతాల్లో తౌబల్, జిరిబామ్, చందేల్, ఉఖ్రుల్, సేనాపతి, తమెంగ్లాంగ్ లు ఉన్నాయి.
శనివారం జరిగే ఓటింగ్ లో కీలక నేతలు తమ ఆదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోబోతున్నారు. మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఓక్రం ఇబోబిసింగ్, ఆయన కుమారుడు సూరజ్ కుమార్, మాజీ ఉపముఖ్యమంత్రి గైఖాంగమ్ వంటి ప్రముఖులతోపాటు బీజేపీ నుంచి 22 మంది, కాంగ్రెస్ 18, జేడీయూ, నాగా పీపుల్స్ ఫ్రంట్ చెరో పది మంది, నేషనల్ పీపుల్స్ పార్టీ 11 మంది, శివసేన, ఎన్సీపీ ఇద్దరు చొప్పున, ఆర్పీఐఏ నుంచి ముగ్గురు, 12 మంది స్వతంత్ర అభ్యర్థులు రెండో విడుత అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 28న 38 స్థానాలకు మొదటి విడుత ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక శనివారం నాడు కీలకమైన 22 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఫేస్ మాస్క్లు, శానిటైజర్, సామాజిక దూరం మరియు థర్మల్ స్క్రీనింగ్తో సహా ఓటర్ల కోసం కోవిడ్-19 ప్రోటోకాల్లు నిర్వహించబడుతున్నాయి.
