త్రిపుర కొత్త సీఎంగా మాణిక్ సాహా
త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా మాణిక్ సాహాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. బిప్లబ్ కుమార్ దేబ్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో అక్కడ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా వున్న మాణిక్ సహాను సీఎంగా ఎంపిక చేశారు
త్రిపుర (Tripura) కొత్త ముఖ్యమంత్రిగా మాణిక్ సాహాను (Manik Saha) బీజేపీ (bjp) హైకమాండ్ ప్రకటించింది. ఈ మేరకు మాణిక్ను బీజేపీ శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. సీఎం పదవికి బిప్లబ్ కుమార్ దేబ్ (biplab kumar deb) రాజీనామా చేయడంతో మాణిక్ సాహాను ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు కమల నాథులు. మాణిక్ సాహా ప్రస్తుతం త్రిపుర రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలతో పాటుగా త్రిపుర క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, ఆయన 2016లో బీజేపీలో చేరారు. రాజకీయాల్లోకి రాకముందు త్రిపుర మెడికల్ కాలేజీలో డెంటల్ ఫ్యాకల్టీగా పనిచేశారు.
ఇకపోతే.. త్రిపుర సీఎం పదవికి బిప్లబ్ కుమార్ దేబ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. శనివారం మధ్యాహ్నం రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన ఆయన తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. త్రిపురలో పాతికేళ్ల కమ్యూనిస్ట్ పాలనకు తెరదించుతూ 2018లో బీజేపీ అధికారాన్ని అందుకుంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర పదో ముఖ్యమంత్రిగా బిప్లబ్ కుమార్ దేబ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే పలు వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలను పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ విరుచుకుపడింది.
Also Read:బ్రేకింగ్ : త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ రాజీనామా
వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం మార్పు తథ్యమని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బిప్లబ్ రాజీనామా చేశారు. దీనికి తోడు సొంత పార్టీ నుంచి కూడా ఆయనకు అసమ్మతి సెగ తలిగినట్లుగా తెలుస్తోంది.