సగం తిన్నాక సమోసాలో పచ్చకాగితం.. రైల్వే క్యాంటీన్ నిర్వాకం, ట్వీట్ చేస్తే ఐఆర్సీటీసీ క్షమాపణలు..
రైల్వే క్యాంటీన్ ఆహారం గురించి.. దాని శుభ్రత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓ ప్రయాణికుడికి అలాంటి అనుభవమే ఎదురయ్యింది. సమోసాలో ఓ మందపాటి పచ్చకాగితం వచ్చింది. ఖంగుతిన్న అతను వెంటనే ఆ ఫోటోతో ట్వీట్ చేశాడు.
ఢిల్లీ : రైల్లో అమ్మే సమోసాలో పచ్చ కాగితం దర్శనమిచ్చిందని ఓ ప్రయాణీకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముంబై- లక్నో రైల్లో ప్రయాణిస్తున్న తనకు ఈ చేదు అనుభవం ఎదురయిందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు. రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నిర్వహించే ప్యాంట్రీ సిబ్బంది విక్రయించారని పేర్కొంటూ.. కాగితంతో ఉన్న సమోసా ఫోటోను అజి కుమార్ అనే వ్యక్తి షేర్ చేశాడు. అక్టోబర్ 9వ తేదీన బాంద్రా నుంచి లక్నోకి 20921 నెంబరు రైల్లో వెళ్తూ ఐఆర్ సిటిసి ప్యాంట్రీ సిబ్బంది విక్రయించిన సమోసా కొన్నాను.
సగం తిన్న తర్వాత అందులో ఈ పచ్చ పేపర్ కనిపించింది.. అంటూ ట్వీట్ చేసాడు. అయితే ఆ ట్వీట్ పై ఐఆర్ సిటిసి స్పందించింది. అజి కుమార్ ను క్షమాపణలు కోరింది. ‘సార్, మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మీ పీఎన్ఆర్, మొబైల్ నెంబర్ ను డిఎంలో షేర్ చేయండి’ అంటూ పేర్కొంది. ‘ఈ ఘటనను పరిగణలోకి తీసుకుంటా’మని అంటూ మరో ట్వీట్ చేసింది. అయితే, ఈ ఘటనపై ఆర్ సి టి సి క్షమాపణలు చెప్పినప్పటికీ… నెటిజన్లు మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
బాబోయ్.. పిజ్జాలో గాజు ముక్కలు.. తింటుంటే పంటికిందికి.. కస్టమర్ కు చేదు అనుభవం..
రైల్వే వ్యవస్థ రోజురోజుకీ అధ్వాన్నంగా తయారవుతుందని ఘాటుగా స్పందిస్తున్నారు ‘టికెట్ కన్ఫర్మేషన్ సహా పలు అంశాల్లో రైల్వే వ్యవస్థ రోజురోజుకీ అధ్వానంగా మారుతోంది. ప్రతీదానికి ఇష్టారీతిన డబ్బు వసూలు చేస్తున్నారు. పేద ప్రజల దుస్థితి మీకు అర్థం కాలేదు. ఇది ప్రజల డబ్బును కొల్లగొట్టడమే’ అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు. కాగా మరికొందరు అతడికి మద్దతుగా నిలుస్తూ కామెంట్లు పెడుతున్నారు.