కుటుంబ కలహలతో నడిరోడ్డుపై భార్యను అత్యంత కిరాతకంగా వేట కొడవలితో భర్త నరికి చంపిన ఘటన తమిళనాడులో చోటు చేసుకొంది. మదీశ్వరన్ అనే వ్యక్తి తన భార్య ప్రియను నరికి చంపాడు. తీవ్రంగా గాయపడిన ప్రియ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

చెన్నై:తమిళనాడు రాష్ట్రంలో ఓ వ్యక్తి తన భార్యను పట్టపగలే నడిరోడ్డుపై కత్తితో విచక్షణరహితంగా పొడిచి చంపాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఓ మహిళను నడిరోడ్డుపై నరికి చంపుతున్నా ఎవరూ కూడ అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు. పైగా ఈ తతంగాన్ని చోద్యం చూస్తున్నట్టు చూశారు.తమిళనాడులోని దిండిగల్ జిల్లా రాజపాలెంలో గత నెల 20 వ తేదీన ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు.

మదీశ్వరన్ అనే వ్యక్తి తన భార్య ప్రియను నడిరోడ్డుపై నరికి చంపాడు. తన వెంట తెచ్చుకొన్న వేటకొడవలితో రోడ్డుపై ఆమెను కిందపడేసి విచక్షణరహితంగా మెడపై నరికేశాడు. తీవ్రంగా గాయపడిన ప్రియ రక్షించాలని కోరినా కూడ ఎవరూ కూడ పట్టించుకోలేదు.

సీసీ కెమెరాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. బాధితురాలి గురించిన సమాచారాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడు వెళ్లిపోయిన తర్వాత పోలీసులు సంఘటన స్థలం నుండి బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించారు. 

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.ఈ ఘటనకు సంబంధించి నిందితుడు మదీశ్వరన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ కలహాలే ప్రియ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.